బెంగళూర్ : కర్నాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించి సిద్ధరామయ్య సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం విధాన సౌధ ప్రాంగణాన్ని గోమూత్రంతో శుభ్రం చేశారు. బీజేపీ అవినీతి పాలనకు చరమగీతం పాడటంతో తాము ఈ కార్యక్రమం చేపట్టామని కార్యకర్తలు తెలిపారు.
డిప్యూటీ సీఎం, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అంతకుముందు గోమూత్రంతో విధాన సౌధను శుభ్రం చేయాల్సి ఉందని ఈ ఏడాది జనవరిలో పేర్కొన్నారు. విధాన సౌధను క్లీన్ చేసేందుకు తన వద్ద గోమూత్రం సిద్ధంగా ఉందని అప్పట్లో చెప్పుకొచ్చారు. బీజేపీ హయాంలో అవినీతితో అసెంబ్లీ కాలుష్యంతో కప్పేసిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం సాగించిన పలు స్కామ్ల వివరాలతో కాంగ్రెస్ కరప్షన్ రేట్ కార్డును ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేసింది.
రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఏకంగా రూ. లక్షన్నర కోట్లు లూటీ చేసిందని కాంగ్రెస్ ఆరోపించింది. సీఎం పదవికి రూ. 2500 కోట్లు, మంత్రి పదవికి రూ. 500 కోట్లు బీజేపీ బేరం పెట్టిందని విమర్శించింది. బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కాదని ట్రబుల్ ఇంజిన్ ప్రభుత్వమని విమర్శలు గుప్పించింది. ఇక మఠాలకు నిధుల కేటాయింపులకు 30 శాతం, కాంట్రాక్టులకు 40 శాతం, కొవిడ్-19 సరఫరాలకు 75 శాతం వరకూ కాషాయ నేతలు కమీషన్లు వసూలు చేశారని ఆరోపించింది.
Read More