బెంగళూరు: పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘన (Lok Sabha security breach)కు పాల్పడి లోక్సభలోకి చొరబడిన నిందితులు, మైసూరు బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా మధ్య ఉన్న సంబంధాలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. నిందితుల విజిటర్ పాస్లపై ఎంపీ ప్రతాప్ సింహా సంతకం చేశారని, అలాంటి నిర్లక్ష్యం కూడా శిక్షార్హమైన నేరమని అన్నారు. పార్లమెంట్లో బుధవారం జరిగిన భద్రతా ఉల్లంఘనలను ఆయన ఖండించారు. ఆ యువకులు ఎంపీకి తెలిసి ఉండవచ్చని అన్నారు. పరిచయస్తులు కాకపోతే, అపరిచితులకు పాస్లు ఎలా జారీ చేస్తారని ప్రశ్నించారు. అనాలోచిత నిర్లక్ష్యపు చర్యలు కూడా చట్టం ప్రకారం శిక్షార్హులే అన్నది గమనించాలని అన్నారు.
కాగా, పార్లమెంటు సభ్యులందరూ క్షేమంగా ఉండటం చాలా ఉపశమనం కలిగించిందని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. అయితే అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ ఇలాంటి సంఘటన జరుగడం నిజంగా షాకింగ్ పరిణామని అన్నారు. భద్రతా వ్యవస్థలో లోపాలను స్పష్టం చేస్తోందని చెప్పారు. ఈ సంఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయడం కేంద్ర ప్రభుత్వం, ముఖ్యంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విధి అని అన్నారు.
మరోవైపు పార్లమెంట్పై ఉగ్రవాదులు దాడి చేసి 22 ఏళ్లు పూర్తయిన రోజునే భద్రతా ఉల్లంఘనలు జరుగడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీఎం సిద్ధరామయ్య అన్నారు. ‘యువకులు పొగ వస్తువులతో పార్లమెంటులోకి ఎలా ప్రవేశించారు? ఈ చర్యలో అంతర్గత వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? యువకుల చర్యల వెనుక బాహ్య శక్తుల ప్రమేయం ఏమైనా ఉందా?’ అని ప్రశ్నించారు. దేశ పార్లమెంటు భద్రతకు భరోసా లేనప్పుడు, దేశ సరిహద్దుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతాయని చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రధాని నరేంద్ర మోదీపై ఉందన్నారు.