Karnataka CM : బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy Stadium) లో ఆర్సీబీ విజయోత్సవాల (RCB celebrations) సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది. కర్ణాటక సర్కారు (Karantaka Govt) వైఫల్యంవల్లే తొక్కిసలాట జరిగిందని నాటి నుంచి ఈ ఘటనపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.
ఈ విమర్శలపై సీఎం సిద్ధరామయ్య శుక్రవారం అసెంబ్లీ వేదికగా స్పందించారు. గత పదేళ్లలో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో 20 తొక్కిసలాట ఘటనలు జరిగాయని, వాటిపై భాజపా నేతలు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. 2008లో హిమాచల్ ప్రదేశ్లోని నైనాదేవి ఆలయంలో తొక్కిసలాట, అదే ఏడాది జోధ్పూర్ తొక్కిసలాట, 2021లో హరిద్వార్ తొక్కిసలాట, 2013లో రతన్గఢ్ తొక్కిసలాట, 2023లో మధ్యప్రదేశ్లో తొక్కిసలాట, 2024 హాత్రాస్లో తొక్కిసలాట ఘటనలు జరిగాయని, ఆ ఘటనల్లో వందలాది మంది ప్రాణాలు కోల్పోయినప్పుడు బీజేపీ నేతలు ఏం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఈ ఏడాది జనవరిలో ప్రయాగ్రాజ్లో నిర్వహించిన కుంభమేళాలో తొక్కిసలాట జరిగి 39 మంది ప్రాణాలు కోల్పోతే ఆ రాష్ట్ర ప్రభుత్వం మృతుల వివరాలు కూడా వెల్లడించలేదని సిద్ధరామయ్య ఆరోపించారు. ‘ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ గెలువడంతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో సంబురాలు నిర్వహించారు. ఈ సంబురాలకు అభిమానులు భారీ సంఖ్యలో హాజరుకావడంతో తొక్కిసలాట జరిగింది. ఒక్కోసారి ప్రజల అభీష్ఠానికి తలవంచాల్సి వస్తుంది. కాబట్టి మేం కూడా విజయోత్సవాల్లో పాల్గొన్నాం’ అని చెప్పారు.
కాగా ఈ ఏడాది జూన్లో చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందగా.. 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ఘటన అప్పట్లో కలకలం రేపింది. ఘటనపై దర్యాప్తునకు కర్ణాటక ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ను ఏర్పాటుచేసింది. ఈ కమిషన్ పలువురు ప్రత్యక్ష సాక్షులు, క్రికెట్ సంఘం అధికారులు, పోలీస్ అధికారుల వాంగ్మూలాలను రికార్డు చేసింది. ఆర్సీబీ విజయోత్సవ ఈవెంట్లో తీవ్ర భద్రతా వైఫల్యం ఉన్నట్లు గుర్తించింది. స్టేడియం లోపల కేవలం 79 మంది పోలీసులను మాత్రమే మోహరించారని, ఘటనా స్థలం వద్ద అంబులెన్స్లు లేవని తెలిపింది. పోలీసు యంత్రాంగం వైఫల్యం స్పష్టంగా ఉందని నివేదికలో కమిషన్ పేర్కొంది.
ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి ఆర్సీబీ, కర్ణాటక క్రికెట్ బోర్డు, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థపై పలు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. కర్ణాటక హైకోర్టు కూడా ఈ కేసును విచారిస్తున్నది.