బెంగళూర్ : అయోధ్యలో బాలరాముడు కొలువైన వేళ కర్నాటక సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము (కాంగ్రెస్) గాంధీ కొలిచిన రాముడిని పూజిస్తామని, బీజేపీ రాముడిని కాదని అన్నారు. సీతా, లక్ష్మణుడి నుంచి శ్రీరాముడిని వేరు చేసేందుకు కాషాయ పార్టీ ప్రయత్నిస్తోందని సిద్దరామయ్య విమర్శించారు.
సీతా, లక్ష్మాణుడు లేకుంటే రాముడు లేడని, రాముడు సర్వాంతర్యామి అని అయోధ్యకే పరిమితం కాడని వ్యాఖ్యానించారు. రాముడి ఉనికి ఆయన ఆలయం కంటే విస్తృతంగా ఉంటుందని అన్నారు. మహదేవ్పుర జిల్లాలో రామ, సీత, లక్ష్మణ్, హనుమాన్ విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం సిద్ధరామయ్య మాట్లాడారు. తాను ఒకరోజు అయోధ్యను సందర్శిస్తానని సిద్ధరామయ్య పేర్కొన్నారు. శ్రీరాముడు ప్రతి ఒక్కరికీ భగవంతుడని, ఆయన బీజేపీ దేవుడు కాదని, హిందువులందరి దేవుడని స్పష్టం చేశారు.
తాము కూడా రామ భక్తులమేనని చెప్పారు. అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయ ప్రారంభోత్సవ వేడుకకు కాంగ్రెస్ నేతలు దూరంగా ఉండటంపై సిద్ధరామయ్య స్పందిస్తూ తాము శ్రీరామ వ్యతిరేకులుగా చిత్రీకరించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అయోధ్యలో శ్రీరామ మందిరానికి తాము వ్యతిరేకం కాదని, కానీ వారు రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు.
Read More :
Bhadradri | రామమందిరం ప్రాణప్రతిష్ఠ.. భద్రాచలంలో అట్టహాసంగా రథోత్సవం