బెంగళూర్ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు (Karnataka) ముగిసి ఆరునెలలైనా ఆ పార్టీ ఓటమి నైరాశ్యం నుంచి బయటపడలేదు. రాష్ట్ర అసెంబ్లీలో విపక్ష నేతను ఇప్పటివరకూ ఆ పార్టీ నియమించకపోవడం బీజేపీ ఎమ్మెల్యేల్లో అసమ్మతి రాజేసింది. పార్టీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప అధ్యక్షతన జరిగిన అంతర్గత సమావేశంలో ఈ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతను నియమించని పక్షంలో బెలగావిలో జరిగే అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు కాబోమని పార్టీ ఎమ్మెల్యేలు అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు.
బెంగళూర్లో జరిగిన పార్టీ అంతర్గత భేటీలో విపక్ష నేత నియామకంలో జరుగుతున్న జాప్యం పట్ల ఎమ్మెల్యేలు మండిపడ్డారు. ఇదే విషయమై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలతో ఇరకాటంలో పడుతున్నామని వారు హైకమాండ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బెలగావిలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల సందర్భంగా విపక్ష నేత నియామకం చేపడతామని యడియూరప్ప హామీ ఇచ్చారు.
పార్టీ హైకమాండ్ ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. బీజేపీ ఇప్పటివరకూ శాసనసభా పక్ష నేతలను నియమించకపోవడాన్ని కాంగ్రెస్ ఎత్తిచూపుతోంది. రాజకీయ చరిత్రలో ఇలాంటి పరిస్ధితి ఎన్నడూ తలెత్తలేదని ఎద్దేవా చేసింది. ఎన్నికలు ముగిసి ఆరునెలలైనా బీజేపీ ఇప్పటివరకూ శాసనసభ, విధాన మండలిలో పార్టీ నేతలను నియమించలేదని కాంగ్రెస్ నేత దినేష్ గుండూరావు పేర్కొన్నారు.
Read More :