Viral News : కర్ణాటక (Karnataka) లో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జీవితమంతా భిక్షాటన చేస్తూ గడిపిన ఓ 68 ఏళ్ల మహిళ ఇంట్లో రూ.8.40 లక్షల నగదు బయటపడింది. ఆమె మొత్తం 30 కి పైగా బస్తాల్లో నోట్ల (Currency Notes) ను, నాణేల (Coins) ను దాచిపెట్టింది. అయితే ఆ డబ్బును ఆమె ఉపయోగించుకోకుండానే కన్నుమూసింది. మాండ్య (Mandya) లో ఇటీవల ఈ ఘటన వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. మాండ్యకు చెందిన హూర్ వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో ఆదివారం మృతిచెందింది. ఆమె మరణించిన తర్వాత స్థానికులు ఆమె ఇంటిని పరిశీలించారు. ఈ సందర్భంగా బస్తాల్లో పెద్ద మొత్తంలో నగదు కనిపించింది. రూ.10, రూ.20, రూ.50 నోట్లు భారీగా ఉన్నాయి. వేల సంఖ్యలో నాణేలు కూడా బయటపడ్డాయి. హూర్ తన సోదరితో కలిసి అద్దె ఇంట్లో ఉండేవారు. ఆమె సోదరి రెండేళ్ల క్రితమే చనిపోయారు. ఇద్దరికీ వివాహం కాలేదు. హూర్ జీవితమంతా భిక్షాటన చేస్తూ వచ్చినట్లు స్థానికులు తెలిపారు.
బస్తాల్లో ఉన్న నగదును స్థానికులు బయటకు తీసి లెక్కించారు. మొత్తం రూ.8.40 లక్షలు ఉన్నట్లు తేలింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అయితే ఆమె ఇంట్లో దొరికిన నగదును హూర్ సోదరులకు అప్పగించారు. ఒక సోదరుడు రూ.6 లక్షలు తీసుకోగా.. మరో సోదరుడికి రూ.2.40 లక్షలు దక్కాయి. ఆ మొత్తాన్ని ఆయన మసీదుకు విరాళంగా ఇచ్చారు.