బెంగళూరు, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కన్నడనాట ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. వచ్చే నెల 10న జరుగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ తమ ప్రచారాన్ని ప్రారంభించేశాయి. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేశాయి. కన్నడ రాజకీయ చదరంగంలో ముఖ్యమైన పార్టీ.. జేడీఎస్. వచ్చే ఎన్నికల్లో అయినా ఈ పార్టీ కింగ్ అవుతుందా? లేక కింగ్ మేకర్గానే ఉంటుందా? అనేదానిపై విస్తృతంగా చర్చ నడుస్తున్నది. బీజేపీ ప్రభుత్వంపై నెలకొన్న తీవ్ర ప్రజావ్యతిరేక, కాంగ్రెస్లో నెలకొన్న అంతర్గత కుమ్ములాటల నేపథ్యంలో ఈసారి కూడా ఏ పార్టీ కూడా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇదేగనుక జరిగితే, గతంలో పలుమార్లు మాదిరిగానే ప్రభుత్వం ఏర్పాటులో జేడీఎస్ కీలకమయ్యే అవకాశం ఉన్నది. అయితే రాష్ట్రంలో సంకీర్ణ సర్కారు వస్తుందన్న అంచనాలను మాజీ సీఎం, జేడీఎస్ నేత కుమారస్వామి తోసిపుచ్చారు. ఈసారి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 123కు పైగా స్థానాల్లో గెలిచి, సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని విశ్వాసంగా చెప్తున్నారు.
పాత మైసూర్ ప్రాంతంలో జేడీఎస్కు గట్టి పట్టు ఉన్నది. ఆ ప్రాంతంలో ఒక్కలిగల ఓట్లు ప్రభావిత స్థాయిలో ఉంటాయి. వీరిలో అత్యధికంగా జేడీఎస్ వెంటే ఉంటున్నారు. ఇక్కడ జేడీఎస్ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం బీజేపీ, కాంగ్రెస్కు సాధ్యం కావడం లేదనే విశ్లేషణలు ఉన్నాయి.
1999 నుంచి జేడీఎస్ ఇప్పటి వరకు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోయినప్పనటికీ, సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలకంగా మారింది. 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ 28-58 మధ్యన సీట్లు గెలుచుకుంటూ వస్తున్నది. 2006, 2018లో జేడీఎస్ సంకీర్ణ సర్కార్లో పాలుపంచుకొన్నది. 2006 ఫిబ్రవరి నుంచి దాదాపు 20 నెలల పాటు కుమారస్వామి సీఎంగా కూడా చేశారు. 2018లో కాంగ్రెస్తో కలిసి అధికారం పంచుకొన్నారు. కుమారస్వామి ఏడాది మూడు నెలల పాటు సీఎంగా కొనసాగిన తర్వాత.. సంకీర్ణ పక్ష ఎమ్మెల్యేలు ఆపరేషన్ కమలానికి లొంగడంతో ప్రభుత్వం పడిపోయింది.
మూడు రోజుల్లో 39 కోట్లు సీజ్ ఎన్నికల కోడ్ అమలైన 3రోజుల్లోనే అధికారులు రూ.39.38 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేయొద్దని ఆ రాష్ట్ర రైతు సంఘం, హసిరుసేన అధ్యక్షుడు కొడిహళ్లి చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త వ్యవసాయ చట్టాలతో రైతు గొంతు పిసికేందుకు కేంద్రంలోని బీజేపీ కుట్రలు చేసిందని, రాష్ట్రంలోని బీజేపీ కూడా రైతు వ్యతిరేక విధానాలతో ముందుకు వెళ్తున్నదని మండిపడ్డారు.