BJP | బెంగళూరు, మే 8: కర్ణాటకలో కమీషన్ల మకిలీ కమలం పార్టీని వదిలిపెట్టేలా లేదు. బురదలోనైనా కమలం వికసిస్తుందంటూ ఆ పార్టీ నేతలు గొప్పగా చెబుతుంటారు. అయితే అవినీతి బురదలో కూరుకుపోయిన ఆ పార్టీకి అధః పాతాళమే తప్ప ఈసారి అధికారం కల్లేనని జోరుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నెల 10న జరిగే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రయోగిస్తున్న కమీషన్ అస్త్రం ధాటికి విలవిల్లాడుతున్న బీజేపీ దాని ఫలితాన్ని కొద్ది రోజుల్లోనే చవిచూడబోతున్నదంటూ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలు పాల్గొన్న ప్రతి ఎన్నికల సభలోనూ తమపై పడ్డ అవినీతి బురదను కడుక్కోవడానికి నానా పాట్లు పడ్తున్నా అది ఎంతకూ వదలడం లేదు. ‘కర్ణాటకలో సీఎం బొమ్మైది 40 శాతం కమీషన్ల పాలన అంటూ కాంగ్రెస్ విమర్శలు చేస్తున్నది. ఆ పార్టీ వద్ద ఆధారాలుంటే న్యాయస్థానాలకు పోవచ్చు కదా’ అని హోం మంత్రి అమిత్ షా తమను సమర్థించుకునే ప్రయత్నాలు చాలాసార్లు ఎన్నికల సభల్లో చేశారు. ‘కాంగ్రెస్ వారు చేస్తున్న విమర్శలు ఆధార రహితం. కమీషన్ల గురించి వారి వద్ద గట్టి ఆధారాలుంటే కోర్టులకు పోవచ్చు. దీనిపై ఇంతవరకు బీజేపీపై ఎలాంటి కేసు కాని, విచారణ కాని లేదు. అలాంటప్పుడు ప్రజలు దీనిని ఎలా నమ్ముతారు’ అని ఆయన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.
నిజంగా అమిత్ షా వాదనే నిజమనుకుంటే ఆ అవినీతి ఆరోపణలతోనే కేఎస్ ఈశ్వరప్పతో ఎందుకు రాజీనామా చేయించారని విపక్షాలు అమిత్ షాను ప్రశ్నిస్తున్నాయి. గత ఏడాది ఏప్రిల్లో కర్ణాటకకు చెందిన సివిల్ కాంట్రాక్టర్ పాటిల్ ఆత్మహత్య చేసుకున్నారు. తన పెండింగ్ బిల్లుల మొత్తం చెల్లించాలంటే పెద్దమొత్తంలో లంచం ఇవ్వాలని మంత్రి ఈశ్వరప్ప, ఆయన అనుచరులు తనను డిమాండ్ చేశారని, వారు అడిగిన లంచాన్ని ఇచ్చుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్టు చనిపోయే మందు మీడియాకు, మిత్రులకు తను పంపిన సూసైడ్ నోట్లో ఆరోపించాడు. పాటిల్ ఆత్మహత్యతో పలువురు బాధిత కాంట్రాక్టర్లు బహిరంగంగా గళం విప్పారు. నిజంగా బీజేపీ ప్రభుత్వంలో కమీషన్ల పాలన లేకుంటే కాంట్రాక్టర్ ఎందుకు ఆత్మహత్య చేసుకుంటారు? మంత్రి పదవికి ఈశ్వరప్ప ఎందుకు రాజీనామా చేస్తారు? అన్న ప్రశ్నలు అందరిలో చిన్నమొక్కలా ప్రారంభమై వటవృక్షంలా పెద్దవయ్యాయి.
కర్ణాటకలో బీజేపీ పాల్పడిన అవినీతి కారణంగా రెండోసారి ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వివిధ మార్గాల ద్వారా ఆక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు బీజేపీ అధిష్ఠానానికి చేరుతున్నాయని, వాటితోనే అది దేశంలోని విపక్షాలు పాలిస్తున్న రాష్ర్టాల్లోని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వినియోగిస్తున్నారని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ప్రతి పనికి 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని, ఆ మొత్తంతోనే రాష్ట్రంలో ఎమ్మెల్యేలను కొన్నారని అంటున్నారు. దేశంలోనే కర్ణాటక బీజేపీ ప్రభుత్వం అత్యంత అవినీతి ప్రభుత్వమని, 40 శాతం కమీషన్ ముట్టకుంటే ఒక్క అడుగు కూడా ముందుకేయలేదని ఒక కాంగ్రెస్ అగ్రనేత విమర్శించారు.