Karnataka | కర్నాటక హైకోర్టులో సిద్ధరామయ్య సర్కారుకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ సంస్థల్లో ప్రైవేట్ సంస్థల కార్యాకలాపాలను పరిమితం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులపై గతంలో హైకోర్టు ధార్వాడ్ సింగిల్ జడ్జి బెంచ్ స్టే ఇచ్చింది. సింగిల్ జడ్జి నిర్ణయాన్ని ప్రభుత్వం సవాల్ చేసింది. స్టే విషయంలో అదే బెంచ్కు వెళ్లాలని న్యాయమూర్తులు ఎస్జీ పండిట్, గీతా కేబీలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రభుత్వానికి సూచించింది. అయితే, సిద్ధరామయ్య ప్రభుత్వం ఇటీవల ప్రభుత్వ ప్రాంగణాల్లో ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని.. నిర్వహించే ముందు ప్రైవేటు సంస్థలు పరిపాలనా అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా ఏదైనా కార్యక్రమం, ఊరేగింపు భారత జాతీయ చట్టం (BNS) నిబంధనల ప్రకారం చట్టవిరుద్ధమని పేర్కొంది. ఈ ఉత్తర్వులు ఆర్ఎస్ఎస్ లక్ష్యంగా చేసుకున్నట్లుగా ఆరోపణలు వచ్చాయి. ప్రభుత్వం ఉత్తర్వుల్లో ఆర్ఎస్ఎస్ పేరును నేరుగా ప్రస్తావించనప్పటికీ.. ఉత్తర్వుల్లోని నిబంధనలు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలు, మార్చ్లపై ప్రభావం చూపే ఉద్దేశంతో ఉన్నాయని విమర్శలు వచ్చాయి. ఈ ఉత్తర్వులను పునస్చైతన్య సేవా సమస్త అనే సంస్థ ధార్వాడ్ హైకోర్టు బెంచ్లో సవాల్ చేసింది. ఈ పిటిషన్ను విచారించిన సింగిల్ బెంచ్ జడ్జి ప్రభుత్వ ఉత్తర్వులపై మధ్యంతర స్టే ఇచ్చింది. అయితే, ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్పై విచారణ సందర్భంగా.. ప్రజలంతా కలిసి కవాతు చేయాలనుకుంటే.. దాన్ని ఆపొచ్చా? అంటూ బెంచ్ ప్రశ్నించింది. ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై దిసభ్య ధర్మాసనం అప్పీల్ దాఖలు చేసేందుకు సింగిల్ జడ్జి న్యాయమూర్తిని ఆశ్రయించాలని సూచించింది.
ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శశి కిరణ్ శెట్టి వాదనలు వినిపిస్తూ.. ఈ ఉత్తర్వు ర్యాలీలు, ఊరేగింపులు వంటి వ్యవస్థీకృత కార్యక్రమాలకు వర్తిస్తుందని, అనధికారిక సమావేశాలకు కాదన్నారు. ప్రభుత్వం ఇప్పటికే నిరసనలను ఫ్రీడమ్ పార్క్కు, క్రీడా కార్యక్రమాలను కంఠీరవ స్టేడియానికి పరిమితం చేసిందని పేర్కొన్నారు. పునశ్చేతన సేవా సంస్థ, వీ కేర్ ఫౌండేషన్ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది అశోక్ హర్నహళ్లి వాదనలు వినిపిస్తూ.. క్రికెట్ ఆడే జట్టు సైతం ప్రతిరోజూ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇరువర్గాల వాదనలు విన్ని సింగిల్ ధర్మాసనం ప్రభుత్వం అప్పీల్ను తోసిపుచ్చింది. ఈ అంశంపై మరోసారి ఈ నెల 17న ధార్వాడ్ బెంచ్ విచారణ జరుపనున్నది.