ఢిల్లీ, మార్చి 27(నమస్తే తెలంగాణ): మద్యం కొనుగోళ్ల వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేస్తున్న దర్యాప్తు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నదని బీఆర్ఎస్ శాసనమండలి సభ్యురాలు కవిత తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వికలాంగులు, మహిళలను ఇండ్ల వద్దనే విచారించాలన్న నిబంధనను ఈడీ ఉల్లంఘించిందని చెప్పారు. సీఆర్పీసీలోని 160 సెక్షన్ ప్రకారం మహిళలను ఇండ్ల వద్దనే విచారణ చేయాలని కోరారు.
ఈడీ విచారణపై స్టే మంజూరు చేయాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అజయ్ రస్తోగి, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కపిల్ సిబల్ వాదనలు కొనసాగిస్తూ, సీబీఐ దర్యాప్తునకు ఈడీ విచారణకు తేడా ఏమీ లేదని, మద్యం కేసు ఎఫ్ఐఆర్లో కవిత పేరు కూడా లేదని, అలాంటప్పుడు ఈడీ తన ఆఫీసులో విచారణ చేయటం చెల్లదని చెప్పారు. కవితకు సమన్లు జారీ చేసిన ఈడీ ఢిల్లీలోని కార్యాలయంలో ఆఫీసు పనివేళలు ముగిసిన తర్వాత రాత్రి 8 గంటలు దాటినా విచారణ చేయటం చట్టవ్యతిరేకమని ప్రకటించాలని కోరారు.
ఈడీ జారీ చేసిన నోటీసుల్లో విచారణకు హాజరుకావాలని ఉన్నదని, మద్యం కేసులో కవిత నిందితురాలు కానప్పుడు ఈడీ విచారణకు రావాలని సమన్లు ఎలా జారీ చే స్తుందని ప్రశ్నించారు. ఈడీ తన కార్యాలయానికి పిలిచి విచారించే అంశంలో అభిషేక్ బెనర్జీ, నళిని చిదంబరం కేసులను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. మహిళలను ఇండ్ల వద్దనే విచారించాలని సీబీఐకి సబంధించిన కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను ఈడీ విచారణకు కూడా వర్తింపజేయాలని కోరారు. ఢిల్లీలోని కవిత కార్యాలయంలోనే ఈడీ విచారణకు ఉత్తర్వులివ్వాలని కోరారు. లేనిపక్షంలో వీడియో కాన్ఫరెన్స్ విధానంలో దర్యాప్తునకు ఉత్తర్వులు ఇస్తే అందుకు అవసరమైన మౌలిక వసతులను కవిత కల్పిస్తారని హామీ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు తుది ఉత్తర్వులు జారీ చేసే వరకు ఈడీ మనీలాండరింగ్ యాక్ట్లోని 50(2), 50(3) సెక్షన్ల ప్రకారం విచారణకు హాజరుకావాలన్న నోటీసుల అమలును నిలిపివేస్తూ స్టే ఇవ్వాలని కోరారు.
మహిళలను ఇంట్లో విచారించాలా? ఆఫీసులో విచారించాలా? అనేది తేల్చాలని న్యా యవాది కపిల్ సిబల్ కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, ఇదే అంశంపై మద్రాస్ హైకోర్టు చాలా స్పష్టంగా తన అభిప్రాయాన్ని వెల్లడించిందని గుర్తు చేసింది. ఆ అభిప్రాయాన్ని అమలు చేసే విధంగా ఉండాలని ఈడీ తరఫు న్యాయవాది ఎస్వీ రాజు కోరారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీలాండరింగ్ యాక్ట్ (పీఎంఎల్ఏ) సెక్షన్ 50 అనేది కేవలం విచారణకు మాత్రమేనని దర్యాప్తు కాదని వివరించారు.
ఈ వాదనను కపిల్ సిబల్ తీవ్రంగా వ్యతిరేకించారు. విజయ్ మదన్లాల్ కేసుకు ముందు ఈ వ్యవహారం ఉత్పన్నం కాలేదని వివరించారు. మద్రాస్ హైకోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమీక్షించాలని కోరారు. తిరిగి కల్పించుకున్న సుప్రీంకోర్టు, త్రిసభ్య ధర్మాసనం ఈ అంశాన్ని పరిషరిస్తుందేమో అని తెలుపగా.. లేదని సిబల్ జవాబు చెప్పారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, అరెస్ట్కు ముందు వరకు ప్రత్యేకమైన పద్ధతులు పాటించాలని విజయ్ మదన్లాల్ (పీఎంఎల్ఏ) కేసులో ఉత్తర్వులు స్పష్టం చేస్తున్నాయని తెలిపింది.
ఆ కేసులో తీర్పు పిటిషనర్కు మేలు జరిగేదేనని వ్యాఖ్యానించింది. అది నిజమేనంటూ సిబల్ చెప్పారు. పీఎంఎల్ఏ వ్యవహారంలో సమన్లు జారీ చేసేందుకు ఎలాంటి ప్రక్రియ లేదని చెప్పగా, చట్టంలోని 50(2) నిబంధన స్పష్టంగా ఉన్నదని సుప్రీంకోర్టు తెలిపింది. అది విచారణకు చెందినదని, ఈడీ పిటిషనర్కు సమన్లు జారీ చేసిందని సిబల్ చెప్పారు.. పీఎంఎల్ఏ చాప్టర్ 8లోని సమన్లు.. సాక్ష్యాధారాలు, పత్రాలను సమర్పించేందుకేనని తెలిపారు. సమన్ల జారీకి పీఎంఎల్ఏలో కచ్చితమైన విధానం లేదని వాదించారు.
కాబట్టి ఈ వ్యవహారంపై ఈడీకి సుప్రీంకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. వాదనల తర్వాత సుప్రీంకోర్టు, మహిళలను ఇండ్ల వద్దనే విచారణ చేయాలంటూ గతంలో దాఖలైన నళిని చిదంబరం, అభిషేక్ బెనర్జీ కేసులతో కవిత దాఖలు చేసిన పిటిషన్ను జత చేసి విచారిస్తామని ప్రకటించింది. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కల్పించుకుని అభిషేక్ బెనర్జీ కేసుతో జత చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. కవిత, బెనర్జీ కేసులు వేర్వేరని తెలిపారు. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.