న్యూఢిల్లీ, మే 25: కాంగ్రెస్ అధిష్ఠానంపై తిరుగుబావుటా ఎగురవేసిన సీనియర్ నేత కపిల్ సిబల్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నెల 16నే కాంగ్రెస్కు రాజీనామా చేసినట్టు ఆయన బుధవారం తెలిపారు. ఒక పార్టీలో దీర్ఘకాలం కొనసాగడం ప్రతీ ఒక్కరికీ క్లిష్టమైన పనేనన్న ఆయన.. ఎప్పుడో ఒక సమయంలో తమ గురించి తాము ఆలోచించుకోవాల్సిన అవసరమున్నదని తెలిపారు. సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్తో కలిసి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి వెళ్లిన సిబల్, రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్గా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీలతో సంబంధంలేకుండా పార్లమెంట్లో స్వతంత్రంగానే తన గళాన్ని వినిపిస్తానన్నారు. కాంగ్రెస్లో సంస్కరణలు డిమాండ్ చేస్తూ తిరుగుబాటు చేసిన 23 మంది సీనియర్లలో కపిల్ సిబల్ ఒకరు.
సిబల్ రాజ్యసభ సభ్యత్వ కాలం వచ్చే నెలతో ముగుస్తున్నది. యూపీ అసెంబ్లీలో ఎస్పీకి 111 మంది ఎమ్మెల్యేలున్నారు. ఆ పార్టీ ప్రస్తుతం ముగ్గురు సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశం ఉన్నది. ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్కు బెయిల్ ఇప్పించటంలో సిబల్ కీలకంగా వ్యవహరించారు. దీంతో ఆజంఖాన్ మద్దతుదారులు సిబల్ను ఎస్పీ తరఫున రాజ్యసభకు పంపాలని ఒత్తిడి తేవటంతోనే ఆ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు సమాచారం. తాజా పరిణామాన్ని కాంగ్రెస్ తేలిగ్గా తీసుకొన్నది. సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్లోకి నిత్యం నేతలు వస్తూనే ఉంటారు.. పోతూనే ఉంటారని ఆ పార్టీ నేత కేసీ వేణుగోపాల్ వ్యాఖ్యానించారు.
కీలక నేతలు గుడ్బై
ఐదురాష్ర్టాల ఎన్నికల్లో దెబ్బతిన్న కాంగ్రెస్ను కీలక నేతల వలసలు మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నది. గడిచిన ఐదు నెలల వ్యవధిలో ఐదుగురు కీలక నేతలు పార్టీని వీడారు.
సునీల్ జాఖడ్: పంజాబ్ సీఎంగా చన్నీని నియమించడాన్ని తప్పుబడుతూ రాజీనామా చేశారు.
అశ్వనీ కుమార్: రానున్న రోజుల్లో పార్టీ మరింత దిగజారే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ కాంగ్రెస్కు రాజీనామా చేశారు.
ఆర్పీఎన్ సింగ్: గత కాంగ్రెస్ ఇప్పుడు లేదని యూపీ ఎన్నికల ముందు పార్టీని వీడారు.
హార్దిక్ పటేల్: సమస్యలపై మాట్లాడితే అగ్రనేతలు ముఖాలను ఫోన్లలో పెట్టుకొంటున్నారని, గుజరాత్ నేతలు చికెన్ శాండ్విచ్ల సరఫరాకే పరిమితమయ్యారని ఆరోపిస్తూ రాజీనామా చేశారు.
కపిల్ సిబల్: సంస్కరణలు చేపడితేనే కాంగ్రెస్కు మనుగడ అని చెబుతూ పార్టీని వీడారు.