బెంగళూరు, మార్చి 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కన్నడనాట ఎన్నికల నగారా మోగింది. దీంతో ఎన్నికల రణరంగంలోకి దిగేందుకు బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ సహా ఇతర అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కర్ణాటకలో నెలకొన్న రాజకీయ చదరంగానికి సంబంధించి ఒక చర్చ ముందుకు వస్తున్నది. గత 38 ఏండ్ల చరిత్రను పరిశీలిస్తే.. ఆ రాష్ట్రంలో ఏ పార్టీకి వరుసగా రెండోసారి అధికార దక్కలేదు.
1985 నుంచి జరిగిన ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం చేతులు మారుతూ వస్తున్నది. దీంతో ఈ సెంటిమెంట్ ఈసారి కూడా కొనసాగుతుందా లేదా బ్రేక్ అవుతుందా! అని కర్ణాటకతో పాటు దేశ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఈసారి కూడా అధికారం చేపడుతామని బీజేపీ చెబుతుండగా.. సమాజంలో విద్వేషం రేపుతున్న, ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలను పీల్చిపిప్పి చేస్తున్న అధికార బీజేపీకి ఓటర్లు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని కాంగ్రెస్ పేర్కొంటున్నది.
దక్షిణాదిలో రెండు జాతీయ పార్టీలకు ప్రాణ సంకటంగా మారిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న నిర్వహించనున్నారు. అదే నెల 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్ బుధవారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. 224 అసెంబ్లీ సీట్లున్న కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీకి 119, కాంగ్రెస్కు 75, జేడీఎస్కు 28 మంది ఎమ్మెల్యేల బలం ఉన్నది. రెండు సీట్లు ఖాళీగా ఉన్నాయి.
ఈసీ తొలిసారి వయోధికులు, దివ్యాంగులకు ఇంటి నుంచే ఓటువేసే (ఓట్ ఫ్రమ్ హోం) అవకాశాన్ని కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కల్పిస్తున్నది. 80 ఏండ్లు పైబడిన వృద్ధులు, కదలలేని స్థితిలో ఉన్న వికలాంగులకు ఈ అవకాశం కల్పిస్తామని సీఈసీ రాజీవ్కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సోమవారం, శుక్రవారం కాకుండా ఈ సారి బుధవారం పోలింగ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన గిరిజన సమూహాల్లో అర్హులైన వ్యక్తులందరికీ ఓటుహక్కు కల్పించామని తెలిపారు. ఈ ఎన్నికల కోసం రాష్ట్రవ్యాప్తంగా 58,282 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. సగటున 883 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ ఉంటుందని వెల్లడించారు. ఇందులో 1,320 పోలింగ్ కేంద్రాలను మహిళలే నిర్వహిస్తారని పేర్కొన్నారు.
మైసూర్: ఇవే తనకు చివరి ఎన్నికలని కర్ణాటక కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ‘మా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చాలా మంది కోరుతున్నారు. అయితే నా సొంత నియోజకవర్గం నుంచి పోటీ చేసి, గెలిచి, రిటైర్ కావాలన్నది కోరిక. అందుకే వరుణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తా’ అని తెలిపారు. ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, కాబట్టి పారదర్శకంగా నిర్వహించడానికి ఈసీ చర్యలు తీసుకోవాలని కోరారు.