భోపాల్ : వరుస పరాజయాలు, అంతర్గత విభేదాలు, నేతల నిష్క్రమణలతో సంక్షోభం ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీకి తాజాగా కీలక నేత వ్యాఖ్యలు ఇబ్బందికలిగించేలా ఉన్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన స్పందన వస్తోందని కాంగ్రెస్ నేత, ట్రబుల్షూటర్ కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వ్యాఖ్యానించారు.
రాహుల్ పాదయాత్ర సందర్భంగా మధ్యప్రదేశ్లో ఏర్పాటుచేసిన సభలకు వచ్చిన జనం కంటే తన ర్యాలీలకే ప్రజల నుంచి మెరుగైన ఆదరణ లభించిందని నకుల్నాథ్ పేర్కొన్న వీడియోను పలువురు బీజేపీ నేతలు షేర్ చేశారు. రాహుల్ గాంధీతో కలిసి తాను మధ్యప్రదేశ్ అంతా తిరిగానని, అయితే బెరసియాలో భారత్ జోడో యాత్ర కంటే తన సభకే ఎక్కువ మంది ప్రజలు హాజరయ్యారని ఇక్కడి వారికి తాను చెప్పదలుచుకున్నానని నకుల్ నాథ్ ఈ క్లిప్లో చెబుతుండటం వినిపించింది.
మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్నాథ్ కుమారుడు నకుల్ నాథ్ వీడియోను బీజేపీ ప్రతినిధి షెజాద్ పూనావాలా షేర్ చేస్తూ కాంగ్రెస్ అగ్రనేతపై మండిపడ్డారు. రాహుల్ గాంధీని నేతగా కాంగ్రెస్ నేతలే పరిగణించడం లేదని, అలాంటప్పుడు దేశ ప్రజలు, ఇతర భాగస్వామ్య పక్షాలు రాహుల్ను ఎందుకు సీరియస్గా తీసుకుంటాయని ప్రశ్నించారు. నకుల్ నాథ్ చింద్వారా లోక్సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.