Nakul Nath | దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల (Lok Sabha Polls) హడావుడి ఊపందుకుంది. మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇక తొలి విడత (Phase 1) పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. ఇందుకు సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ కూడా ఇప్పటికే ముగిసింది. మొత్తంగా 1618 మంది అభ్యర్థులు మొదటి విడత బరిలో నిలిచారు. అయితే ఇందులో అత్యంత ధనవంతులైన పది మంది అభ్యర్థుల జాబితాను (Richest Candidate) అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Association of Democratic Reforms) తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో అత్యంత ధనవంతుడిగా మధ్యప్రదేశ్లోని ఛింద్వారా నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సీఎం కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ (Nakul Nath) నిలిచారు. ఆయనకు రూ.700 కోట్లకుపైనే ఆస్తులు ఉన్నట్టు ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు.
ఛింద్వారా నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో నిలిచిన నకుల్ నాథ్ ఇటీవలే నామినేషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్కు సమర్పించిన అఫిడవిట్లో తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. నకుల్ నాథ్ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న వివరాల ప్రకారం.. తన మొత్తం ఆస్తుల విలువ దాదాపు రూ.717 కోట్లుగా ప్రకటించారు. ఇందులో చరాస్తులు రూ.641 కోట్లు కాగా, స్థిరాస్తులు రూ.48.07 కోట్లుగా తెలిపారు. అయితే, సొంత వాహనాలు లేవని పేర్కొనడం గమనార్హం. గత ఐదేళ్ల కాలంలో తన ఆస్తులు దాదాపు రూ.40 కోట్లు పెరిగినట్లు పేర్కొన్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తాను రూ.7.89 కోట్లు, తన భార్య రూ.4.39 కోట్లు అర్జించినట్లు తెలిపారు.
ఇక తన చేతిలో రూ.44.97 లక్షలు, తన భార్య వద్ద రూ.43,866 నగదు ఉన్నట్లు తెలిపారు. తన వద్ద 1,896 గ్రాముల గోల్డ్ బార్లు, నగలు, 7,630 కిలోల వెండి ఆభరణాలు ఉన్నట్లు తెలిపారు. వీటితోపాటు డైమండ్లు కూడా ఉన్నట్లు తెలిపారు. మొత్తంగా రూ.5 కోట్లకుపైనే విలువైన బంగారు, వెండి, వజ్రాభరణాలు ఉన్నట్లు (భార్యకు తనకు కలిపి) అఫిడవిట్లో ప్రకటించారు. గత లోక్సభ ఎన్నికల్లో దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు రూ.660 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు నకుల్ నాథ్ వెల్లడించినట్లు అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తెలిపింది.
ఇక, నకుల్ నాథ్ తర్వాతి స్థానంలో తమిళనాడులోని ఈరోడ్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఏఐఏడీఎంకే నేత అశోక్ కుమార్ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ. 662కోట్లు ఉన్నట్టు అఫిడవిట్లో వెల్లడించారు. తమిళనాడులోని శివగంగ నుంచి బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి దేవనాధన్ యాదవ్ మూడో స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తులు రూ. 304కోట్లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇక రూ.206 కోట్లతో ఉత్తరాఖండ్ లోని తెహ్రీగర్వాల్ నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి మాల రాజ్యలక్ష్మీ షా నాలుగోస్థానం, రూ.159 కోట్ల విలువైన ఆస్తులతో ఉత్తరప్రదేశ్లోని సహరాన్ఫూర్ నుంచి పోటీకి దిగిన బీఎస్పీ నేత మజీద్ అలా ఐదోస్థానంలో నిలిచారు.
Also Read..
Woman Lawyer | కస్టమ్స్ అధికారుల పేరుతో మహిళా న్యాయవాదికి బెదిరింపులు.. రూ.10లక్షలు దోపిడీ
Arvind Kejriwal | ఈడీ అరెస్ట్పై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్
Raj Thackeray | ఎన్డీయేకు బేషరతుగా మద్దతు ప్రకటించిన రాజ్ థాకరే