ఆగ్రా, మార్చి 6: మహారాష్ట్రలో ఉల్లి రైతులు మాదిరే ఉత్తరప్రదేశ్లోని ఆలుగడ్డల రైతుల పరిస్థితి దారుణంగా తయారైంది. రాష్ట్రంలోని ఆగ్రాలో క్వింటాల్ ఆలుగడ్డల హోల్సేల్ ధర రూ.400-450 మాత్రమే పలుకుతున్నది. అది కూడా ఈ ధర పెద్ద సైజ్ గడ్డలకే. మీడియం, చిన్న సైజు ఆలుగడ్డలను అమ్మటం గగనంగా మారిందని ఆగ్రా సమీపంలోని ఓ కోల్డ్స్టోరేజ్ యాజమాని దూంగర్ సింగ్ చౌదరి పేర్కొన్నారు. ఆలుగడ్డల ధర పడిపోయిన నేపథ్యంలో స్థానిక ఆలూ ఉత్పాదక్ కిసాన్ సమితి ప్రధాన కార్యదర్శి మహ్మద్ ఆలంఘిర్ కొత్త ప్రతిపాదన చేశారు.
ప్రజాపంపిణీ వ్యవస్థలో భాగంగా గోధుమలకు బదులుగా ఆలుగడ్డలను పంపిణీ చేయొచ్చు కదా! అని అన్నారు. గోధుమలు, వరిని రూ.2,125, రూ.2,040లకు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వ సంస్థలు.. అందు లో సగం రేటు అయినా ఇచ్చి ఆలుగడ్డలను తమ నుంచి కొనుగోలు చేయొచ్చని అన్నారు. తర్వాత వాటిని పీడీఎస్ ద్వారా బియ్యం, గోధుమలలాగా పంపిణీ చేయవచ్చని పేర్కొన్నారు. తద్వారా గోధు మ నిల్వలు పడిపోతున్నాయన్న ఆందోళన, అధిక ఉష్ణోగ్రతల కారణంగా ఉత్పత్తి పడిపోతున్నదన్న భయం తగ్గుతుందని అన్నారు.