Kolkata Doctor Death | కోల్కతా, ఆగస్టు 15: కోల్కతాలోని ఆర్జీ కార్ దవాఖానలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై అర్ధరాత్రి పశ్చిమబెంగాల్ అట్టుడికింది. ‘స్వాతంత్య్రం వచ్చిన అర్ధరాత్రి మహిళల స్వాతంత్య్రం కోసం’ అంటూ నిర్వహించిన ఆందోళన హింసాత్మకంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల మహిళలు అర్ధరాత్రి నిరసన వ్యక్తం చేశారు. నిరసనకారులుగా పేర్కొంటూ సుమారు 40 మంది గుంపు గురువారం అర్ధరాత్రి ఆర్జీ కార్ హాస్పిటల్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. దవాఖాన ప్రాంగణంలోకి చేరుకున్న ఆందోళనకారులు ఎమర్జెన్సీ విభాగాన్ని, నర్సింగ్ స్టేషన్, మందుల స్టోర్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. అక్కడ విధి నిర్వహణలో ఉన్న పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఆందోళనకారులను అదుపుచేయడానికి పోలీసులు బాష్పవాయువును ప్రయోగించారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. విధులలో ఉన్న తమకు రక్షణ కల్పించాలంటూ నర్సులు ఆందోళన చేశారు. తాము చేస్తున్న ఆందోళనను నైతికంగా దెబ్బతీయడానికే దవాఖానపై దాడి చేశారని, అయితే న్యాయం కోసం తమ ఆందోళన కొనసాగుతుందని డాక్టర్లు స్పష్టం చేశారు.
హింసాత్మక ఘటనలకు బాధ్యత వహిస్తూ మమతా బెనర్జీ సీఎం పదవికి రాజీనామా చేయాలని విపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. డాక్టర్ మృతికి నిరసగా కాళీఘాట్లోని సీఎం ఇంటి ముందు శుక్రవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తామని బీజేపీ మహిళా విభాగం ప్రకటించింది. ఆందోళన చేస్తున్న డాక్టర్లకు రక్షణ కల్పించడంలో, హింసను నిరోధించడంలో మమత ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పరిస్థితిని మమత ప్రభుత్వం అదుపు చేయలేకపోతే ఆర్మీని దింపాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్ డిమాండ్ చేశారు.
జూనియర్ డాక్టర్ హత్యాచారం కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత ఏడు రోజుల నుంచి ఆరోగ్య సేవలు స్తంభించగా, తమ సహచర విద్యార్థినికి న్యాయం చేయాలంటూ జూనియర్ డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. చాలా ప్రభుత్వ దవాఖానలలో ఇప్పటికే ఔట్ పేషంట్, అత్యవసర సేవలు నిలిచిపోవడంతో సేవలందక రోగులు అల్లాడుతున్నారు. కాగా, దవాఖానను గురువారం సందర్శించిన గవర్నర్ బోస్ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లతో మాట్లాడారు.
రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి సీపీఐ(ఎం), బీజేపీ ఈ విధ్వంసానికి పాల్పడ్డాయని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. తాను ఈ విషయంలో విద్యార్థులు, ఆందోళన చేస్తున్న డాక్టర్లను తప్పుబట్టడం లేదని అన్నారు. ఆర్జీ కార్ దవాఖానలో విధ్వంసం సృష్టించింది బయటివారేనని ఆమె అన్నారు. బాధిత మహిళా డాక్టర్కు న్యాయం జరగాలంటూ శుక్రవారం తాను వీధుల్లోకి రానున్నట్టు ఆమె ప్రకటించారు.