ప్రయాగ్రాజ్, ఏప్రిల్ 16: పోలీసు కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అతని సోదరుడు ఆష్రఫ్ హత్యలతో ఉత్తరప్రదేశ్ ఉలిక్కిపడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్రంలో 144 సెక్షన్ విధించారు. వారణాసిలో పోలీసులు ఫ్లాగ్మార్చ్ నిర్వహించారు. ఈ సంఘటనపై విచారణకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రిటైర్డ్ జస్టిస్ అరవింద్ కుమార్ త్రిపాఠి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఐదుగురు డాక్టర్ల బృందం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించింది. అతీక్ అంత్యక్రియలకు ఇంతకాలం పరారీలో ఉన్న ఆయన భార్య షైస్తా పర్వీన్ హాజరవుతారని, ఆమె లొంగిపోతారని ప్రచారం జరుగుతున్నది.
పేరు కోసమే అతీక్ను చంపాం: నిందితులు
అతీక్ లాంటి గ్యాంగ్స్టర్ను చంపితే పేరు వస్తుందనే ఈ హత్య చేశామని నిందితులు లవ్లేశ్ తివారీ (22), మోహిత్ అలియాస్ సన్నీ (23), అరుణ్ మౌర్య (18) పోలీసులకు తెలిపారు. అతీక్తో తమకు పాత కక్షలున్నాయన్నారు. ఈ సంఘటనలో తివారీకి సైతం గాయాలయ్యాయి. వీరు వినియోగించిన పిస్టల్ టర్కీలో తయారైంది. ఇలాంటి పిస్టల్ పాకిస్థాన్ ద్వారా భారత్కు అక్రమంగా తెచ్చి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కాగా, జర్నలిస్టుల ముసుగులో ఇద్దరి హత్య జరిగిన నేపథ్యంలో పాత్రికేయుల రక్షణకు ఒక ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం భావిస్తున్నట్టు తెలిసింది.
ఉగ్రవాదులతో అతీక్కు సంబంధాలు
తనకు పాకిస్థాన్కు చెందిన ఐఎస్ఐతో పాటు ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తాయిబాతో సంబంధాలున్నాయని తమ ఇంటరాగేషన్లో అతీక్ అంగీకరించాడని పోలీసులు చెప్పారు.
పలువురు నేతల ఖండన
పోలీసు కస్టడీలో ఉన్న అతీక్, అతని సోదరుడిని హత్య చేయడం ఉమేశ్పాల్ హత్య కన్నా అమానుషమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. ఈ ఘటనను బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఖండించారు. ఇది కచ్చితంగా యోగి ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించారు. యోగి ఆదిత్యనాథ్ వెంటనే రాజీనామా చేయాలని, సంఘటనపై సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో విచారణ జరిపించాలని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.