హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ)/ న్యూఢిల్లీ: అదానీ వ్యవహారంపై జేపీసీ వేయాలనే డిమాండ్తో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో పట్టువిడవకుండా ఆందోళన చేస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై చర్చించాలని, జేపీసీ వేయాలని బీఆర్ఎస్, పలు ఇతర విపక్ష పార్టీల ఆందోళనలు, నినాదాలతో సోమవారం కూడా ఉభయసభల్లో వాయిదా పర్వం కొనసాగింది. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా కేంద్రం కనీసం స్పందించకపోవడం దారుణమని, అదానీ అంశం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సర్కార్ పలు అంశాలను తెరపైకి తెస్తూ ప్రయత్నాలు చేస్తున్నదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
అదానీ అంశంపై తక్షణం జేపీసీ వేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమీపంలోని విజయ్చౌక్ వద్ద ధర్నా చేశారు. కేంద్ర వైఖరికి వ్యతిరేకంగా ఎంపీలు పెద్దయెత్తున నినాదాలు చేశారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు పాల్గొన్నారు. ‘మోదీ డౌన్ డౌన్, కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం నశించాలి, అదానీ అంశంపై జేపీసీ వేయాలి, ప్రజాస్వామ్య విలువలు కాపాడాలి’ అంటూ నినాదాలు చేశారు.
జవాబుదారీతనం లేని కేంద్రం
కేంద్రం కావాలనే అదానీ అంశాన్ని పకదోవ పట్టించేందుకు పార్లమెంట్ను వాయిదా వేసుకుంటూ పోతున్నదని బీఆర్ఎస్ ఎంపీ నామా విమర్శించారు. ప్రతిపక్షాల గొంతు నొకుతున్నదని ధ్వజమెత్తారు. ప్రజాప్రతినిధులు ప్రతిరోజూ పార్లమెంట్ లోపల, బయటా ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశాలపై చర్చించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేస్తున్నా కేంద్రం జవాబు చెప్పకుండా మొహం చాటేస్తుండడం దారుణమన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయ పబ్బం గడుపుకుంటున్నదని దుయ్యబటారు. కేంద్రం తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారన్నారు. కోట్లాది మంది కష్టపడి సంపాదించుకొన్న డబ్బును ఎల్ఐసీ, ఎస్బీఐ, తదితర బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో దాచుకున్నారని, ఇప్పుడు ప్రజల సొమ్ముకు భద్రత కరువైందన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
అదానీ వ్యవహారంపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ సమావేశాల మొదటి రోజు నుంచి బీఆర్ఎస్ ఆందోళన చేస్తున్నదని ఎంపీ కే కేశవరావు పేర్కొన్నారు. అదానీ గ్రూపు అనేక కంపెనీలను టేకోవర్ చేసుకొన్నదని, ఇది సాధారణ కుంభకోణం కాదని, ఒక రాజకీయ స్కామ్ అని ఆరోపించారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ప్రజల సొమ్ముపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉన్న అదానీ వ్యవహారంపై జేపీసీ వేసి, విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, సోమవారం పార్లమెంట్ సమావేశాల ప్రారంభానికి ముందు కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీల ఎంపీలు సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జేపీసీ వేయడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని ఎంపీలు ప్రశ్నించారు.