న్యూఢిల్లీ, నవంబర్ 25: జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్య కేసులో నలుగురు దోషులకు ఢిల్లీలోని అడిషనల్ సెషన్స్ కోర్టు జీవిత ఖైదు విధించింది. మరొకరికి మూడేండ్ల సాధారణ జైలు శిక్ష వేసింది. దోషులు రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జీత్ మాలిక్, అజయ్కుమార్కు జీవిత ఖైదు విధించింది. ఒక్కొక్కరికి రూ.1.25 లక్షల జరిమానా వేసింది. ఐదో ముద్దాయి అజయ్శెట్టికి మూడేండ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.7.25 లక్షల జరిమానా విధించింది. ఇతడు గత 14 ఏండ్లుగా జైలులో ఉంటున్న అంశాన్ని ధర్మాసనం ఈ సందర్భంగా ప్రస్తావించింది.
మొత్తం జరిమానాను బాధితురాలి కుటుంబానికి చెల్లించాలని కోర్టు ఆదేశించింది. ఇది అరుదైన కేసుల పరిధిలోని రానందున ముద్దాయిలకు మరణ శిక్షను తిరస్కరిస్తున్నట్టు ధర్మాసనం ప్రకటించింది. ప్రముఖ ఆంగ్ల న్యూస్ ఛానెల్ పనిచేస్తున్న సౌమ్య విశ్వనాథన్ 2008 సెప్టెంబర్ 30వ తేదీ తెల్లవారుజామున విధులు ముగించుకొని దక్షిణ ఢిల్లీలోని నెల్సన్మండేలా మార్గ్ మీదుగా ఇంటికి వెళ్తుండగా, ఆమెను దోచుకోవాలనే ఉద్దేశంతో ఈ ఐదుగురు కాల్చి చంపినట్టు విచారణలో రుజువైంది.