(స్పెషల్ టాస్క్ బ్యూరో)
హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దుతో యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాల కల్పనతో పాటు రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్న కేంద్రంలోని బీజేపీ సర్కారు హామీలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. అవినీతి ఆరోపణలతో గత ఏడాది కాలంలో ప్రభుత్వం వరుసగా 4 నోటిఫికేషన్లను రద్దు చేయడం వల్ల కశ్మీర్ యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అధికారుల్లో పేరుకున్న అవినీతి తమకు శాపంగా మారుతున్నదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు. కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి రద్దు ధీరోదాత్తమైన చర్యగా గొప్పలు చెప్పుకునే బీజేపీ నేతలు అక్కడి పాలనలో పేరుకుపోయిన అవినీతి వల్ల ఉద్యోగాల భర్తీ నిలిచిపోవడంపై మాత్రం పెదవి విప్పడంలేదు.
అవినీతి ఆరోపణలతో రద్దు
నియామక ప్రక్రియలో అవినీతి ఆరోపణలు వెలువడటంతో భర్తీ ప్రక్రియ పూర్తి అయ్యాక లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నాలుగు నోటిఫికేషన్లను రద్దు చేసి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. రద్దు చేసిన నోటిఫికేషన్లలో పోలీస్ సబ్ఇన్స్పెక్టర్, ఆర్థిక గణాంక సహాయకులు, జూనియర్ సివిల్ ఇంజనీర్, ఫైర్మెన్, డ్రైవర్ పోస్టులు లాంటివి ఉన్నాయి. అయితే పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీలో అవినీతిపై దర్యాప్తు జరిపిన సీబీఐ 24 మందిని అరెస్టు చేసింది.
47 రోజుల నుంచి నిరసనలు..
రద్దు చేసిన నాలుగు నోటిఫికేషన్లలోని ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులు గత 47 రోజుల నుంచి శ్రీనగర్, జమ్ములో నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. అధికారులు అవినీతికి పాల్పడి, పరీక్షా పత్రాలను లీక్ చేశారని చెప్పి ఆ శిక్ష అందరికీ ఎందుకు వేస్తున్నారని అభ్యర్థులు మండిపడుతున్నారు.
బూడిదలో పోసిన పన్నీరు
గత ఏడాదిగా కష్టపడి చదివాను. ఏడు వేల మంది అభ్యర్థుల్లో 1,622వ స్థానం వచ్చింది. దేహ ధారుడ్య పరీక్షల కసరత్తులు పూర్తి చేశాను. కానీ అర్ధాంతరంగా భర్తీ ప్రక్రియను రద్దు చేశారు. నా కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది.
– అఖిత్ హుసేన్ భట్, ఉద్యోగార్థి