పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assebly Election) పోలింగ్ దగ్గర పడుతున్నప్పటికీ విపక్ష ఇండియా (INDIA) కూటమిలో లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. నామినేషన్ల గడువు ముగిసినప్పటికీ కాంగ్రెస్ (Congress) నేతృత్వంలోని మహాగఠ్బంధన్లో (Mahagathbandhan) సీట్ల పంపకాలపై ఓ స్పష్టత రాలేదు. దీంతో లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ ఆర్జేడీ (RJD) 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా, కాంగ్రెస్ 60 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. సీట్ల సర్దుబాటులో కూటమి పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. తాము ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించింది. ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటించిన మరుసటి రోజే ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. కాంగ్రెస్, ఆర్జేడీ రాజకీయ కుట్ర కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.
‘మహాఘట్బంధన్’ కూటమిలో భాగంగా తమకు సీట్లు దక్కకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని జేఎంఎం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఝార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో ఉన్న పొత్తును తమ పార్టీ సమీక్షిస్తుందని జేఎఎం సీనియర్ నేత సుదివ్య కుమార్ తెలిపారు. రాజకీయ కుట్రలో భాగంగా బిహార్ ఎన్నికల్లో జేఎంఎం పోటీ చేయకుండా ఆర్జేడీ, కాంగ్రెస్ అడ్డుకున్నాయని, ఆ పార్టీలే దీనికి బాధ్యత వహించాలన్నారు. వారికి తమ పార్టీ తగిన సమాధానం ఇస్తుందని చెప్పారు. ఆ పార్టీలతో ఉన్న పొత్తును సమీక్షిస్తుందని వెల్లడించారు. మరోవైపు తొలివడతలో భాగంగా పోలింగ్ జరుగనున్న 121 స్థానాల్లో విపక్ష కూటమి నుంచి 125 మంది పోటీలో ఉన్నారు. కూటమిలో సమన్వయ లోపానికి ఇదే నిదర్శనమని ప్రత్యర్థులు పేర్కొంటున్నారు. ఆర్జేడీ అగ్రనే, మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ వైశాలి జిల్లాలోని రాఘోపూర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.
కాగా, ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహఘఠ్బంధన్లో సీట్ల పంపకాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లేనని అనుకోవాలి. ఆర్జేడీ 143, కాంగ్రెస్ 55, సీపీఐఎంఎల్ 20, సీపీఐ 6, సీపీఎం 4, వీఐపీ 15 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కొన్ని చోట్ల విపక్ష కూటమిలోని పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. బీహార్లో తొలివిడుత నామినేషన్ల గడువు అక్టోబర్ 17న ముగిసింది. అదేవిధంగా రెండో విడతకు సోమవారమే చివరి రోజు. నవంబర్ 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు.