శ్రీనగర్ : బారాముల్లా మసీదుల్లో ప్రార్ధనలు చేస్తుండగా ఉగ్రవాదులు జమ్ము కశ్మీర్ మాజీ పోలీస్ అధికారి మహ్మద్ షఫీని కాల్చిచంపడాన్ని లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా (Manoj Sinha) తీవ్రంగా ఖండించారు. ఈ అనాగరిక చర్యకు పాల్పడిన పిరికిపందలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మసీదులో ప్రార్ధన చేస్తున్న రిటైర్డ్ పోలీస్ అధికారిపై ఉగ్రవాద దాడి తనను తీవ్రంగా కలిచివేసిందని అన్నారు.
ఈ విషాదవేళ కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని చెప్పారు. కాగా, బారాముల్లాలోని మసీద్లో ప్రార్థనలు చేస్తున్న రిటైర్డ్ పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరపడం జమ్ము కశ్మీర్లో కలకలం రేపింది. అజాన్ సందర్భంగా మసీదులో మహ్మద్ షఫీపై కాల్పులు జరుపడంతో మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి.
బారాముల్లాలోని గంట్ముల్లాలో రిటైర్డ్ పోలీసు అధికారి మహ్మద్ షఫీ మసీదులో అజాన్ ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, తీవ్ర గాయాలతో ఆయన ప్రాణాలు కోల్పోయారని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. ఇటీవల లోయలో పోలీసులు, బలగాలపై వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పుల్వామాతో పాటు జమ్మూకశ్మీర్లోని ఇతర ప్రాంతాల్లో భద్రతా బలగాలు తనిఖీలను ముమ్మరం చేశాయి. శ్రీనగర్లోని అన్ని ప్రధాన కూడళ్లలో పాటు ఎగ్జిట్ పాయింట్ల వద్ద మొబైల్ వాహన తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
Read More :