Nitin Gadkari | పెరిగిపోతున్న పెట్రోల్ ధరలు.. పర్యావరణ పరిరక్షణ కోసం అందరూ విద్యుత్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. మున్ముందు ప్రతియేటా ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాల్లో గ్రోత్ పెరుగుతుందని, 2030 నాటికి ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో ఐదు కోట్ల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఇప్పటికే దేశంలో 34.54 లక్షల ఎలక్ట్రిక్ వాహనాల రిజిస్ట్రేషన్ జరిగిందని పేర్కొన్నారు.
క్లీన్ ఎనర్జీ రంగంలో భారత్ స్వావలంభనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దారుగా నిలిచే శక్తి సామర్థ్యాలు భారత్కు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో తిరుగుతున్న పెట్రోల్ వాహనాలను హైబ్రీడ్, పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ఆటోమొబైల్ సంస్థలకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఇందుకు అవసరమైన నియంత్రణ చర్యలు ఖరారయ్యాయని, టెక్నాలజీ డిమానిస్ట్రేషన్లు విజయవంతం అయ్యాయని తెలిపారు. ప్రజా రవాణా, సరుకుల రవాణాను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు కేంద్రం ఆసక్తితో ఉందని చెప్పారు.