వైరస్ వ్యాప్తి తగ్గుముఖం
లాక్డౌన్ తీరును పరిశీలించిన కామారెడ్డి కలెక్టర్ శరత్
కామారెడ్డి టౌన్, మే 25 : కామారెడ్డి పట్టణంలో లాక్డౌన్ అమలు తీరును జిల్లా కలెక్టర్ శరత్ మంగళవారం పరిశీలించారు. పాత బస్టాండ్, రైల్వే స్టేషన్, సిరిసిల్ల రోడ్డు తదితర ప్రాంతాలను ఆయన సందర్శించారు. రైల్వే స్టేషన్లో ప్రయాణికులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా, మాస్కు తప్పనిసరిగా ధరించేలా చర్యలు తీసుకోవాలని స్టేషన్ మాస్టర్ సత్యంను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటింటి జ్వర సర్వే, లాక్డౌన్ అమలుతో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నదన్నారు. రెవెన్యూ, పోలీస్, వైద్యశాఖ సమన్వయంతో పనిచేస్తుండడంతో కరోనా వ్యాప్తి కట్టడి సాధ్యమవుతున్నదన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలో 15 చెక్ పోస్టులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహారాష్ట్ర సరిహద్దులోని మద్నూర్, కర్ణాటక సరిహద్దులోని సోంపూర్ వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఆ రాష్ర్టాలకు చెందిన వారిని జిల్లాలోకి అనుమతించడం లేదన్నారు. సరిహద్దుల్లోని 16 గ్రామాల్లో ఇప్పటి వరకూ కరోనా కేసులు లేవన్నారు. కామారెడ్డి, బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయని, కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పల్లెలు కరోనా రహిత గ్రామాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. కామారెడ్డి ప్రభుత్వ దవాఖానలో కరోనా రోగుల కోసం 327 బెడ్స్ ఏర్పాటు చేశామని, ప్రస్తుతం 80 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు. గ్రామాల సరిహద్దుల్లో కంచెలు ఏర్పాటు చేసి కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో శ్రీను, తహసీల్దార్ ప్రేమ్కుమార్, తదితరులు ఉన్నారు.