రాంచీ: జార్ఖండ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ జిల్లా జడ్జీని ఆటోతో ఢీకొట్టి హత్య చేసిన ఘటన తెలిసిందే. ఆ కేసులో ఇవాళ రాష్ట్ర హైకోర్టుకు సీబీఐ ఓ విషయాన్ని చెప్పింది. కావాలనే ఆ ఆటో డ్రైవర్.. జడ్జిని ఢీకొట్టినట్లు సీబీఐ కోర్టుకు వెల్లడించింది. జడ్జి ఉత్తమ్ ఆనంద్ను కావాలనే చంపారని సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత సీబీఐ ఆ నిర్ణయానికి వచ్చింది. క్రైం సీన్ ఇన్వెస్టిగేషన్లో భాగంగా.. సీసీటీవీ ఫూటేజీ పరిశీలన, త్రీడీ అనాలసిస్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్ ఆధారంగా జడ్జిని కావాలనే హత్య చేసినట్లు పేర్కొన్నారు. గాంధీనగర్, ఢిల్లీ, ముంబైలకు చెందిన ఫోరెన్సిక్ బృందాలతో ఆధారాలను స్టడీ చేసినట్లు సీబీఐ వెల్లడించింది. ఫోరెన్సిక్ నిపుణులు ఇచ్చిన నివేదికను.. ఫిజికల్ ఎవిడెన్స్తో సరిపోల్చి దర్యాప్తు చేస్తున్నారు. గుజరాత్లో ఇద్దరు వ్యక్తులపై నిర్వహించిన నార్కో అనాలసిస్, లై డిటెక్టర్ పరీక్షల ఫలితాలను కూడా స్టడీ చేస్తున్నట్లు సీబీఐ చెప్పింది. కుట్రపూరితంగా చంపడానికి గల కారణాలను అన్వేషిస్తున్నట్లు దర్యాప్తు ఏజెన్సీ పేర్కొన్నది. ఈ కేసులో డ్రైవర్ లఖన్ వర్మ, మరో వ్యక్తి రాహుల్ వర్మను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆటో ఓ మహిళ పేరిట రిజిస్టర్ అయి ఉన్నది. ధన్బాద్లో జరుగుతున్న మాఫియా మర్డర్ కేసులను జడ్జి ఉత్తమ్ ఆనంద్ విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ కేసులతో లింకు ఉన్న ఎవరో ఒకరు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.