రాంచీ: జార్ఖండ్(Jharkhand) సర్కార్ కేంద్ర వైఖరిని తప్పుపడుతోంది. ఇప్పటికే ఆ రాష్ట్ర సీఎం హేమంత్ సోరెన్.. ఏడు సార్లు ఈడీ సమన్లను పట్టించుకోలేదు. ఇప్పుడు తాజాగా జార్ఖండ్ సర్కార్ కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సీబీఐ, ఆదాయపన్ను శాఖ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎటువంటి సమాచారాన్ని అడిగినా.. ఆ సంస్థలకు డాక్యుమెంట్లు ఇవ్వవద్దు అని జార్ఖండ్ ప్రభుత్వం అన్ని శాఖలు ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు వేసే ప్రశ్నలను క్యాబినెట్ సెక్రటరీ లేదా విజిలెన్స్ శాఖకు రిపోర్టు చేయాలని జార్ఖండ్ సర్కార్ పేర్కొన్నది.
జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం కూటమి ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఆ పార్టీకి కాంగ్రెస్ మేజర్ భాగస్వామిగా ఉంది. అయితే కేంద్ర స్థాయిలో ఇండియా కూటమి పార్టీలు కూడా దర్యాప్తు ఏజెన్సీలకు సహకరించవద్దు అని తీర్మానించుకున్న విషయం తెలిసిందే. దర్యాప్తు సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోంది బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు.
జార్ఖండ్ సీఎం ప్రధాన కార్యదర్శి వందనా దడేల్ ఈ మేరకు ఓ లేఖను రిలీజ్ చేశారు. దర్యాప్తు సంస్థల నోటీసులకు నేరుగా అధికారులు సమాధానం ఇవ్వరాదు అని ప్రిన్సిపల్ సెక్రటరీ ఆ లేఖలో పేర్కొన్నారు. అయితే సమాచారం అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందని ఆ లేఖలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోనే యాంటీ కరప్షన్ బ్యూరో ఉందని, ఆ ఏజెన్సీ తమ శాఖకు నేరుగా రిపోర్టు చేస్తుందని దడేల్ పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అధికారికి ఈడీ, సీబీఐ, ఐటీ నుంచి లేఖ వస్తే, వాళ్లు తమ ఉన్నత అధికారిని సంప్రదించాలని ఆ లేఖలో చెప్పారు.