న్యూఢిల్లీ : పార్టీ నేతలందరూ తమకు అప్పగించిన బాధ్యతలను నెరవేర్చి మార్గదర్శకాలను పాటిస్తే రాహుల్ గాంధీ తదుపరి దేశ ప్రధాని అవుతారని జార్ఖండ్ కాంగ్రెస్ చీఫ్ రాజేష్ ఠాకూర్ మంగళవారం పేర్కొన్నారు. జేఎంఎంతో తలెత్తిన విభేదాలపై చర్చించేందుకు రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో దేశ రాజధానిలో జరిగిన భేటీ అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఇన్చార్జ్ అవినాష్ పాండే పిలుపు మేరకు జరిగిన ఈ సమావేశం సంతృప్తికరంగా సాగిందని ఠాకూర్ చెప్పారు.
ప్రధాని పదవి చేపట్టేందుకు రాహుల్ గాంధీకి ఉన్న అవకాశాలపై ఆయన మాట్లాడుతూ సమావేశంలో జరిగిన చర్చలకు అనుగుణంగా తాము నిజాయితీగా పనిచేసి తమకు అప్పచెప్పిన బాధ్యతలను నెరవేరిస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని చెప్పారు. జార్ఖండ్లోని 14 స్ధానాల్లో తాము గెలుపొందితే రాహుల్కు ప్రధాని అయ్యే అవకాశాలు మెరుగవుతాయని అన్నారు.
మరోవైపు జేఎంఎం, కాంగ్రెస్ల మధ్య సంబంధాలు బెడిసికొట్టడం కాంగ్రెస్ పార్టీలో ఆందోళన రేకెత్తిస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికలకు రోడ్మ్యాప్ను ఖరారు చేసేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, జార్ఖండ్ ఇన్చార్జ్ అవినాష్ పాండే రాష్ట్ర నేతలతో కలిసి కసరత్తు సాగిస్తున్నారు. హేమంత్ సొరేన్ నేతృత్వంలోని ప్రభుత్వంతో పార్టీ మధ్య సమన్వయాన్ని మెరుగుపరిచేందుకు కమిటీ ఏర్పాటు చేయాలని నేతలు నిర్ణయించారు.