JEE Main 2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు. అభినవచౌదరి, మాజేటి అభినీత్, దుగ్గినేని యోగేశ్, గుత్తికొండ అభిరామ్, వివాలా చిద్విలాస్ రెడ్డి వంద పర్సంటైల్ సాధించారు. ఇదిలా ఉండగా ఉత్తరప్రదేశ్లోని హపూర్కు చెందిన కవలలు నిపుణ్, నికుంజ్ వందశాతం పర్సంటైల్ సాధించారు. దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ మెయిన్-2023 తొలి విడుత పరీక్షా ఫలితాలు మంగళవారం ఉదయం విడుదలయ్యాయి.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం ఉదయమై ఫైనల్ కీని విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ఫలితాల కోసం ఎన్టీఏ వెబ్సైట్ను సందర్శించొచ్చు. ఫలితాల కోసం అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ తప్పనిసరి. గత నెల జనవరి 24 నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ వరకు జేఈఈ మెయిన్ 2023 తొలి విడుత పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 8.5లక్షలకుపైగా విద్యార్థులు హాజరయ్యారు. మరో వైపు జేఈఈ మెయిన్ రెండో విడుత పరీక్షలను ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనుండగా.. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. తొలి విడుత పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడతకు సైతం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.