Prajwal Revanna | బెంగళూరు, హసన్, మే 6: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నది. లోక్సభ ఎన్నికల ప్రచారం మొత్తం సెక్స్ స్కాండల్ చుట్టూనే తిరిగింది. మూడో విడతలో భాగంగా రాష్ట్రంలోని తక్కిన 14 స్థానాలకు సోమవారం ఎన్నికలు జరుగనున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో ఈ సీట్లన్నిటినీ బీజేపీ కైవసం చేసుకున్నది. అయితే ప్రజ్వల్ వ్యవహారం నేపథ్యంలో ఈసారి బీజేపీ సీట్లకు భారీగా కోత పడే అవకాశం ఉన్నదని విశ్లేషకులు అంటున్నారు. సెక్స్ వీడియోల గురించి బీజేపీకి ముందే తెలిసినా జేడీఎస్తో పొత్తు కుదుర్చుకోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఇది లోక్సభ ఎన్నికల్లో ప్రభావం చూపుతుందని కమలనాథులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ప్రధాని నరేంద్రమోదీ సోమవారం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రజ్వల్ వంటి వారిని ఉపేక్షించే అవకాశమే లేదని చెప్పుకొచ్చారు. ప్రజ్వల్ దేశం విడిచి వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని కాంగ్రెస్ సర్కారును విమర్శించారు. ఇది శాంతిభద్రతలకు సంబంధించిన విషయం అయినందున, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపైనే ఉంటుందన్నారు.
మాయమవుతున్న బాధితులు
వీడియోల్లో కనిపించిన పలువురు బాధిత మహిళలు ఇండ్ల నుంచి మాయం అవుతున్నారు. కొందరి ఇండ్లకు గత కొన్ని రోజులుగా తాళాలు వేసి కనిపిస్తున్నాయి. తమ గుర్తింపు బయటపడటంతో బాధితులు భయంతో, తమకు కళంకం వస్తుందనే ఆందోళనతో ఇల్లు విడిచి వెళ్లిపోతున్నట్టు తెలుస్తున్నది. దీనిపై హసన్కు సమీపంలోని ఓ దుకాణాదారుడు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడారు. ‘జిల్లా మొత్తం రేవణ్ణ చేతుల్లో ఉంది. వాళ్ల గురించి చెడుగా మాట్లాడితే వారికి వెంటనే తెలిసిపోతుంది. వాళ్ల కుటుంబానికి, పార్టీకి ఇక్కడ చాలా మంది మద్దతుదారులున్నారు’ అని అతడు తెలిపారు. ప్రజ్వల్పై ఫిర్యాదు చేసిన జెడ్పీ మాజీ సభ్యురాలు ప్రస్తుతం కనిపించకుండా పోయారని ఆమె గ్రామస్థులు చెప్పారు. జేడీ(ఎస్)లో చురుగ్గా పనిచేసిన మహిళా కార్యకర్తలు తాము ప్రజ్వల్తో తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియా నుంచి తొలగిస్తున్నారు. వారి భర్తలు ప్రజ్వల్తో తమ భార్యలకు ఉన్న సంబంధాల గురించి ప్రశ్నిస్తున్నారు. జిల్లాలో చాలా మంది మహిళల జీవితాలను సెక్స్ స్కాండల్ వీడియోలు అభద్రతలో పడేశాయి’ అని జేడీఎస్ స్థానిక నాయకుడు ఒకరు చెప్పారు. రేవణ్ణ కుటుంబంతో ఒక కేసులో పోరాడుతూ హసన్లో బతకడం అసాధ్యమని ఒక దుకాణదారుడు వ్యాఖ్యానించారు.
రేవణ్ణ ఇంట్లో తనిఖీలు
ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) బెంగళూరులోని బసవనగుడిలో గల మాజీ ఎమ్మెలే, ప్రజ్వల్ తండ్రి రేవణ్ణ ఇంట్లో సోమవారం తనిఖీలు నిర్వహించి కొన్ని వస్తువులను స్వాధీనం చేసుకొంది. తనిఖీల సమయంలో తనను ఇంట్లోకి అనుమతించకపోవడంపై రేవణ్ణ తరపు న్యాయవాది గోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. తనిఖీలు ఏక పక్షంగా సాగాయని విమర్శించారు. మరోవైపు ప్రజ్వల్ స్వదేశానికి త్వరలో తిరిగి రావొచ్చనే అంచనాల నేపథ్యంలో బెంగళూరు విమానాశ్రయం వద్ద భద్రత సిబ్బంది అప్రమత్తం అయ్యారు.
హెల్ప్లైన్ ప్రారంభించిన సిట్
హసన్ ఎంపీ ప్రజ్వల్ లైంగిక దాడి కేసులో బాధితుల కోసం హెల్ప్లైన్(6360938947) ప్రారంభించినట్టు సిట్ అధిపతి బీకే సింగ్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బాధితులు తమ ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని.. తామే వ్యక్తిగతంగా వారిని కలుస్తామని స్పష్టం చేశారు. ప్రజ్వల్ కొందరు మహిళను లైంగికంగా వేధిస్తున్న వీడియోలను ప్రజలెవరూ షేర్ చేయొద్దని ఆయన హెచ్చరించారు. ఇలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. వీడియోలు షేర్ చేయడం వల్ల బాధితుల పరువు, గౌరవం దెబ్బ తింటాయని తెలిపారు.