తమ పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని బీజేపీ, కాంగ్రెస్ కుట్రలు పన్నుతున్నాయని జేడీఎస్ అధ్యక్షుడు కుమార స్వామి ఆరోపించారు. బెంగళూరు, మైసూరు ప్రాంతాల్లో తమ పార్టీ చాలా బలంగా ఉందని, అక్కడి నేతలను కొనేయాలని ఈ రెండు పార్టీలూ కుట్రలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఓ ప్రాంతీయ పార్టీ గొంతు పిసికేయాలని చూస్తున్నారని, వారెంత మాత్రమూ సక్సెస్ కారని కుమార స్వామి స్పష్టం చేశారు.
ప్రతి సారీ.. తమది కుటుంబ పార్టీ అంటూ విమర్శలు చేస్తున్నారని, ఈ పార్టీని బతికించుకోడానికి తమ కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేసిందని గుర్తు చేశారు. తన తండ్రి దేవెగౌడతో సహా అందరమూ ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చామని అన్నారు. ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు గెలవలేవని, అందుకే తమ నేతలను తమ పార్టీల్లో చేర్చుకొని, బలం పెంచుకోవాలని చూస్తున్నాయని ఆయన అన్నారు.
పాత మైసూరు ప్రాంతంలో ఈ రెండు జాతీయ పార్టీలకు అసలు బలమే లేదని, ఈ కారణంగానే తమ పార్టీని మింగేయాలని చూస్తున్నారని కుమార స్వామి ఆరోపించారు. తమది కాంగ్రెస్కు బీ టీమ్ అని బీజేపీ పదే పదే విమర్శలు చేస్తోందని, ఈ విషయాన్ని ప్రజలే తేలుస్తారన్నారు. ప్రాంతీయ పార్టీలతోనే రాష్ట్రాలకు మంచి భవిష్యత్ వుంటుందన్నారు.