సమాజ్వాదీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరో ఖరారైంది. కపిల్ సిబల్, జావేద్ అలీ, జయంత్ చౌదరీని అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ అభ్యర్థులుగా ప్రకటించారు. నిజానికి.. జయంత్ చౌదరీకి అఖిలేశ్ హ్యాండిచ్చారు. తనను రాజ్యసభకు పంపుతామని అఖిలేశ్ ఎప్పుడో మాటిచ్చారు. కానీ.. హఠాత్తుగా మూడో సీటు ఆయన భార్య డింపుల్ యాదవ్కు ఇవ్వాలని అఖిలేశ్ ఓ నిర్ణయానికి వచ్చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.
కానీ.. 24 గంటల్లోనే అఖిలేశ్ యాదవ్ యూటర్న్ తీసేసుకున్నారు. భార్య డింపుల్ను డ్రాప్ చేసి, జయంత్ చౌదరీని రాజ్యసభకు నామినేట్ చేసేశారు. ఇవన్నీ కూడా చకచకా జరిగిపోయాయి. దీంతో అందరూ అఖిలేశ్ వైపే చూశారు. కేవలం 24 గంటల్లోనే ఎందుకిలా జరిగిందని అందరూ చర్చించుకున్నారు.
అయితే.. డింపుల్ నామినేషన్ వేసే కొద్ది గంటల ముందే సమాజ్వాదీ నేతలు జయంత్ దగ్గరికి వెళ్లారు. ఆయనతో మాట్లాడారు. రాజ్యసభకు వెళ్లాలని తనకు గట్టిగా వుందని అఖిలేశ్ పంపిన నేతలకు జయంత్ తెగేసి చెప్పారు. యేడాదిన్నర తర్వాత పంపిస్తామని అఖిలేశ్ అంటున్నారని, అదేదో ఇప్పుడే పంపితే సరిపోతుంది కదా.. అంటూ జయంత్ ఎదురు ప్రశ్నించారు. దీంతో అఖిలేశ్ పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది.
అంతేకాకుండా ఏమాత్రం ఆలస్యం చేసినా… బీజేపీ ఈ పరిణామాన్ని క్యాష్ చేసుకుంటుందన్న అనుమానం అఖిలేశ్కు వచ్చిందని తెలుస్తోంది. జయంత్ చౌదరీలో ఉన్న అసంతృప్తిని బీజేపీ క్యాష్ చేసుకొని, బీజేపీ తరపున ఆయన్ను రాజ్యసభకు పంపితే మొదటికే మోసం వచ్చే అవకాశాలున్నాయని అఖిలేశ్కు తట్టిందని ఆయన సన్నిహిత వర్గాలు అంటున్నాయి. ఈ కారణంగానే రాత్రికి రాత్రే అఖిలేశ్ మనసు మార్చేసుకున్నారని సమాచారం.
మరో కారణం కూడా వుందంటున్నారు. ఇప్పుడు జయంత్ చౌదరీని రాజ్యసభకు పంపి, రాబోయే సార్వత్రిక ఎన్నికల నాటికి తమ మధ్య వున్న బంధాన్ని మరింత పటిష్ఠ పరుచుకోవాలన్నది అఖిలేశ్ ప్లాన్గా చెబుతున్నారు. ఇప్పుడే జయంత్ను రాజ్యసభకు పంపి, అక్కడ పార్టీ వాణిని వినిపిస్తే.. వచ్చే ఎన్నికల నాటికి పశ్చిమ యూపీలో తమ బలం పెంచుకోవాలన్నది అఖిలేశ్ వ్యూహమని సమాచారం. ఈ రెండు లెక్కల ఆధారంగానే అఖిలేశ్ మనసు మార్చుకున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.