భయంకరమైన యుద్ధకాలంలో తీవ్రమైన ఆవేదనతో గడుపుతున్న ముక్కోటి భారతీయుల హృదయాలను పాటలతో ఓలలాడించిన స్వర సేనాని కెప్టెన్ రావ్సింగ్ ఠాకూరీ. ఆజాద్ హింద్ ఫౌజ్ గీతం ‘కదవ్ుకదవ్ు బఢాయె జా’ బాణీతో యువతను కదం తొక్కించి, వాయిద్యాల వరుసతో జనగణమను పలికించి స్వాతంత్య్రోద్యమ కాలంలో దేశభక్తిని చాటిన పాటల సైనికుడతడు!
హిమాచల్ ప్రదేశ్కు చెందిన రావ్సింగ్ ఠాకూరీకి రెండో గూర్ఖా రైఫిల్స్లో ఉద్యోగం వచ్చింది. సింగపూర్ బ దిలీ అయ్యాడు. 1942లో శత్రువులకు పట్టుబడి, జైలుపాలయ్యాడు. కొన్నాళ్లకు విడుదలయ్యాక.. ఆజాద్ హింద్ ఫౌజ్లో చేరాడు. దేశభక్తిని పెంపొందించే సాహిత్యానికి స్వరాలు కట్టాడు. మాటలకందని భావాలు స్వరాలకందిన వేళ దేశభక్తిని విద్యుల్లతలా వెలిగిస్తూ అక్షరాల పరిమళాలకు స్వరాలు శోభనద్దాడు. ఆజాద్ హింద్ఫౌజ్ గీతం
‘కదమ్ కదమ్ బఢాయె జా
ఖుషీ కె గీత్ గాయె జా
యే జిందగీ హై ఖ్వావ్కి
తు ఖ్వామ్ పె లుటాయె జా’
కి స్వరాలు కూర్చాడు. ఆ గీతం విన్న తర్వాత సుభాష్ చంద్రబోస్ ముగ్ధుడైపోయాడు. ఈ రాగాలకు ఈ భవనం రెండుగా విడిపోయి ఆకాశం తెరుచుకునేలా ఉందని మెచ్చుకున్నాడు. స్వాతంత్య్రోద్యమకాలంలో ఆ పాట, బాణీ లక్షల మంది భారతీయులు నాలుకలపై నానింది!
రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన ‘జనగణమన’ గేయానికి సంగీత వాయిద్యాలతో బాణీని కూర్చి ప్రశంసలు పొందాడు. తన సహచరులు ఆలపిస్తుంటే స్వయంగా ఠాకూర్ ఫిడేలు వాయిస్తూ గాంధీజీకి జనగణమన బాణీని వినిపించాడు. ఆయన మన్ననలు పొందాడు. 1947లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ‘ఎమరిటస్ మ్యుజీషియన్’ అవార్డుతో గౌరవించింది. ఎన్నో అవార్డులు ఆయన్ని వరించాయి.