శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ నర్వాల్ మండి ప్రాంతంలో శనివారం 16 నిమిషాల వ్యవధిలో రెండు పేలుళ్లు జరిగిన విషయం తెలిసిందే. జంట పేలుళ్లతో తొమ్మిది గాయపడ్డ విషయం తెలిసిందే. అయితే, ఇది ఉగ్రవాదుల పనేనని, రెండింట్లో పేలుడుకు ఐఈడీని వినియోగించినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. మొదటి పేలుడు పాత బొలెరో వాహనంలో జరగ్గా.. రెండో పేలుడు జంక్యార్డ్లో పార్క్ చేసిన మరో వాహనంలో జరిగింది. మొదటి పేలుడు జరిగిన ఘటనా స్థలానికి 50 మీటర్ల దూరంలోనే రెండో పేలుడు చోటు చేసుకున్నది. ఘటనలో గాయపడ్డ వారిని జమ్మూలోని జీఎంసీలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రుల్లో ఒకరికి కడుపులో గాయం కాగా.. మరో ఇద్దరి కాళ్లు విరిగిపోయాయి. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. ఘటన ప్రాంతాన్ని సీల్ చేసి మూసివేయగా.. ఆదివారం నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) పరిశీలించింది. ఈ సందర్భంగా పలువురిని విచారించింది. భారత జోడో యాత్ర సందర్భంగా భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉన్న సమయంలోనే ఉగ్రవాదులు పేలుళ్లకు పాల్పడ్డారు. రాహుల్ యాత్ర 23న జమ్మూకు చేరుకోనున్నది.
ఇదిలా ఉండగా.. శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మరమ్మతు వచ్చిన బొలెరో వాహనంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో వాహనం పక్కనే నిల్చున్న ఐదుగురికి గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ఉన్న వారందరినీ చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత అక్కడికి 50 మీటర్ల దూరంలో ఉన్న జంక్యార్డ్లో పాత వాహనంలోనూ పేలు జరిగింది. ఈ పేలుడులో మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరంతా జీఎంసీలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, ఆర్మీ, సీఆర్పీఎఫ్ అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. వెంటనే ఆ ప్రాంతాన్ని సీల్ వేసి, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. అనుమానంగా కనిపించిన ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. తనిఖీలు నిర్వహించిన సమయంలో పగిలిన మొబైల్ ఫోన్ ముక్కలు దొరకగా.. వాటిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, పేలుడుకు ఫోన్ను వినియోగించారా? లేదా? అనేది స్పష్టంగా తెలియదని పోలీసు వర్గాలు తెలిపాయి. ఫోరెన్సిక్ బృందం సంఘటనా స్థలాల్లో తనిఖీలు నిర్వహించాయి.