Jammu and Kashmir : జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ పాఠశాలలకు అందించిన పుస్తకాలపై వివాదం మొదలైంది. ఆ పుస్తకాలలో తీవ్రవాదులను, వేర్పాటువాదులను గొప్ప వ్యక్తులుగా, లెజెండ్స్గా అభివర్ణించడమే ఇందుకు కారణం. జమ్మూ కాశ్మీర్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని లైబ్రరీలకు ‘గ్రేట్ పర్సనాలిటీస్ అండ్ లెజెండ్స్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ (సిరీస్-4)’ పేరుతో కొన్ని పుస్తకాల్ని అందించారు. హిలాల్ అహ్మద్, సంతోష్ మీనాలు ఈ పుస్తకాలకు ఎడిటర్లుగా వ్యవహరించారు. వీటిని ప్రభుత్వ పథకమైన సమగ్ర శిక్షా పథకం కింద అందించారు. అయితే, ఈ పుస్తకాలలో అభ్యంతరకర కంటెంట్ ఉన్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి.
ముఖ్యంగా జమ్మూకాశ్మీర్ వేర్పాటువాదులను, ఉగ్రవాదులను పొగుడుతూ కంటెంట్ ఉన్నట్లు వెల్లడైంది. షాహిద్ మక్బూల్ భట్ ఉగ్రవాది పేరుతో ఉన్న చాప్టర్లో ఈ వేర్పాటువాద నాయకుడిని విప్లవకారుడిగా, షాహీద్ ఇ అజాంగా అభివర్ణించారు. నిజానికి అతడిని ఉగ్రవాదిగా గుర్తించిన అప్పటి ప్రభుత్వం 1984లో తిహార్ జైలులో మరణశిక్ష విధించింది. ఈ పుస్తకంలో పాకిస్తాన్కు అనుకూలంగా కూడా సమాచారం ఉందని అంటున్నారు. అయితే, ఇలా వేర్పాటువాదుల్ని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా ఉన్న పుస్తకాలను పాఠశాలలకు అందించడంపై ప్రభుత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహించిన ఒమర్ అబ్దుల్లా ఆధ్వర్యంలోని ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇలాంటివాటిని ప్రభుత్వం ఎలా అనుమతించిందని ప్రశ్నిస్తోంది. దీనికి బాధ్యుడైన జమ్మూ కాశ్మీర్ విద్యాశాఖ మంత్రి సకినా ఇటూను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తోంది.
దీన్ని అకడమిక్ జిహాద్గా బీజేపీ అభివర్ణించింది. ఈ పుస్తకాల్లోని అంశంపై జమ్మూ అండ్ కాశ్మీర్ పీపుల్స్ ఫోరమ్ కూడా ఖండించింది. ఈ పుస్తకాల్ని నిషేధించి, బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ అంశంపై జమ్మూ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ఈ విషయం తనకు తెలియదని, తాను ఎప్పుడూ ఆ పుస్తకాల్ని చూడలేదన్నారు. దీంతో సీఎం స్పందనపై ప్రతిపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీనిపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఇలాంటి పుస్తకాల్ని పాఠశాలల్లోకి అనుమతించకూడదని డిమాండ్ చేస్తున్నాయి.