న్యూఢిల్లీ, జనవరి 19: జమిలి ఎన్నికలు అప్రజాస్వామికమని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి ఇది విరుద్ధమని తెలిపింది. జమిలి ఎన్నికలపై అభిప్రాయాలు కోరిన ఉన్నతస్థాయి కమిటీకి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ మేరకు లేఖ రాశారు. ‘ఈ ఆలోచనను వదిలిపెట్టండి. ఇందుకోసం ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీని రద్దు చేయండి. మీరు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు కనిపిస్తున్నది. మీరు చేస్తున్న సంప్రదింపుల్లో నిజాయతీ లేనట్టు అనిపిస్తున్నది. ప్రభుత్వం, పార్లమెంట్, ఎన్నికల సంఘం ప్రజల తీర్పును గౌరవించాలే కానీ ఇలాంటి అప్రజాస్వామిక ఆలోచనలతో వారి దృష్టిని మరల్చకూడదు’ అని ఖర్గే అన్నారు.