హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) పై ఇప్పటి వరకు రూ.80వేలకోట్లకుపైగా వ్యయం చేసినట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ (union jal shakti ministry) బుధవారం లోక్సభలో వెల్లడించింది. ప్రాజెక్టు కోసం రూ.86వేల కోట్ల రుణాన్ని ఆర్థిక సంస్థలు మంజూరు చేశాయని, దాంట్లో ఇప్పటి వరకు రూ.56వేల కోట్లు విడుదల చేయగా.. 83శాతం పనులు పూర్తయ్యాయని జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలపై స్పష్టత కోరుతూ కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇరిగేషన్ ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజక్టుల సలహా సమితి 2018 జూన్లో అంగీకారం తెలిపినట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం సొంత ఖర్చులతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిందని, రాష్ట్ర ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం.. ప్రాజెక్టు నిర్మాణానికి ఈ-ప్రొక్యూర్మెంట్ వేదికల ద్వారా లంప్సమ్ కాంట్రాక్టు సిస్టం ఆధారంగా టెండర్లు పిలిచారని వివరించారు.
అక్టోబర్ 31 నాటికి కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం 83.7 శాతం పూర్తయ్యిందని, దీని కింద 18,25,700 ఎకరాల ఆయకట్టు ప్రాంతానికి నీరు అందించాలని ప్రతిపాదించి… అదనంగా 18,82,970 ఎకరాల భూమిని స్థిరీకరించాలని ఉద్దేశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. 240 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం, సరఫరా చేయడం ద్వారా.. కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, మెదక్, యాదాద్రి భువనగిరి, నల్లగొండ, సంగారెడ్డి, నిజమాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, మెడ్చల్, పెద్దపల్లి జిల్లాల్లోని ప్రాంతాలకు కొత్తగా నీరు అందించి సాగునీటి పరిధిలోకి తీసుకువచ్చే ప్రతిపాదనలు ఉన్నట్లు చెప్పారు.
2015-16 ధరల స్థాయిని అనుసరించి రూ.80,190.46 కోట్ల జలశక్తి శాఖ ఆధ్వర్యంలోని సాగునీరు, వరద నియంత్రణ, బహుళార్ధకసాధక ప్రాజక్టుల సలహా సమితి ఖరారు చేసిందని, ఇప్పటి వరకు ఈ ప్రాజక్టు నిర్మాణం కోసం రూ.80,321.57 కోట్లు ఖర్చు చేశారని షెకావత్ వివరించారు. ప్రాజక్టులో చేపట్టిన అదనపు విభాగాల ప్రతిపాదనలు అనుమతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించలేదన్నారు. ఆరు ఆర్థిక సంస్థలు ప్రాజక్టు కోసం.. రూ.86,064.01 కోట్లు మంజూరు చేసి.. ఇప్పటి వరకు రూ.59,535 కోట్లు విడుదల చేసినట్లు షెకావత్ చెప్పారు.