శ్రీనగర్ : జమ్మూకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో బుధవారం రాత్రి ఎన్కౌంటర్ జరిగింది. ఆర్మీ బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఓ టెర్రరిస్టు హతమయ్యాడు. ఓ పోలీసు అమరుడయ్యాడు. మరో ముగ్గురు జవాన్లు, ఇద్దరు పౌరులు తీవ్రంగా గాయపడ్డారు.
కుల్గాం జిల్లాలోని పరివాన్ ఏరియాలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్లు ఆర్మీ బలగాలకు పక్కా సమాచారం అందింది. దీంతో బుధవారం సాయంత్రం నుంచి ఆ ఏరియాలో బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. గత 12 రోజుల్లో 8 ఎన్కౌంటర్లలో 14 మంది టెర్రరిస్టులను భారత బలగాలు మట్టుబెట్టాయి.