న్యూఢిల్లీ : కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Polls) బీజేపీ ఘోర పరాజయంతో ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీతో ప్రజలు విసుగెత్తారని, మోదీ ప్రచారం, ఉపన్యాసాల పట్ల ఆసక్తి కనబరచడం లేదని అన్నారు. ప్రధాని మోదీ డబుల్ ఇంజిన్ గురించి మాట్లాడుతుంటారని అంటే ఆయన ఉద్దేశం తాను ఢిల్లీలో కూర్చుంటే తన రిమోట్ కంట్రోల్ బెంగళూర్లో కూర్చోవడమేనని ఎద్దేవా చేశారు.
ఇది డబుల్ ఇంజిన్ కాదని, డబుల్ ఇంజిన్ అంటే ఓ ఇంజిన్ ఆర్ధికాభివృద్ధిని పరుగులు పెట్టిస్తే మరో ఇంజిన్ సామాజిక సామరస్యతను పెంపొందించాలని అన్నారు. ప్రధాని మోదీ ప్రచారం పట్ల కూడా ప్రజలు విసుగు చెందారని, ఆయన ఎన్ని రోడ్షోలు చేసి ఆకాశంపై నుంచి పూలు చల్లించినా ప్రజలు ఆసక్తి కనబరచడం లేదని అన్నారు.
కర్నాటకలో 73 శాతం ఓటింగ్ జరిగితే బెంగళూర్లో పోలింగ్ శాతం చాలా తక్కువగా ఉందని జైరాం రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి ఓటింగ్ జరిగిందని తమకు ఓట్లు, సీట్లు పెరిగాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని ముఖ్యంగా పేదలు, గ్రామీణులు, ఆదివాసీలు, గిరిజనులు అక్కున చేర్చుకున్నారని అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పాలక బీజేపీని మట్టికరిపించిన కాంగ్రెస్ పార్టీ మేజిక్ ఫిగర్ను దాటి ఏకంగా 136 స్ధానాల్లో గెలుపొందింది.
Read More