బెంగళూర్ : భారత్ జోడో యాత్రతో నూతన రాహుల్ గాంధీ ఆవిర్భవించడంతో బీజేపీ, ఆరెస్సెస్లో వణుకు మొదలైందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. రాహుల్ పాదయాత్ర తమిళనాడు నుంచి కర్నాటకలోకి ప్రవేశించిన నేపధ్యంలో జైరాం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారు. వర్షం కారణంగా రాహుల్ యాత్ర శనివారం కొద్దిసేపు నిలిచిన అనంతరం తిరిగి ప్రారంభమైంది.
15 రోజుల తర్వాత మళ్లీ పడుతున్న వర్షాలు రైతులకు లాభం చేకూర్చుతాయని, రాహుల్ రాకతో రైతన్నలకు మేలు జరుగుతున్నదని జైరాం రమేష్ ట్వీట్ చేశారు. ఇక కలాలె గేట్ వద్ద విరామం అనంతరం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమయ్యే యాత్ర రాత్రి 7 గంటలకు మైసూర్కు చేరుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి.
కలాలే గేట్ వద్ద భారత్ జోడో యాత్రపై కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్, సీఎల్పీ నేత సిద్ధరామయ్య, పార్టీ నేత పవన్ ఖేరా విలేకరుల సమావేశంలో మాట్లాడతారు. కర్నాటకలో రాహుల్ యాత్ర 511 కిలోమీటర్ల మేర 21 రోజుల పాటు జరుగుతుందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కన్యాకుమారిలో సెప్టెంబర్ 7న ప్రారంభమైన భారత్ జోడో యాత్ర 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 2023 జనవరి 30న జమ్ము కశ్మీర్లో ముగుస్తుంది.