జైపూర్: అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఓ రోడ్డు ప్రమాద బాధితుడు తన కండ్ల ఎదుటే ప్రాణాలు కోల్పోవడం జైపూర్కు చెందిన సందీప్ గుప్తాను తీవ్రంగా కలిచి వేసింది. రెండు దశాబ్దాలుగా ఆయన తన సొంత కారునే అంబులెన్స్గా మార్చి 120 మందికి పైగా క్షతగాత్రులను సమీపంలోని దవాఖానాలకు తరలించారు. ఇందులో 35 మందికి సకాలంలో చికిత్స అందించి వారి ప్రాణాలను కాపాడారు.
దీంతో ఆయన నిస్వార్థ సేవను మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సహా పలువురు ఉన్నతాధికారులు ప్రశంసించారు. ఆయన సహకారం కారణంగా సకాలంలో చికిత్స పొందిన క్షతగాత్రులు ఆయన చేసిన మేలును మరువలేమని చెప్పారు. తన అంబులెన్స్ సేవల గురించి పన్ను సలహాదారుగా పనిచేసే సందీప్ వివరిస్తూ.. 22 ఏండ్ల క్రితం శాసనసభ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి తన కండ్ల ఎదుట ప్రాణాలు విడిచాడని… అంబులెన్స్ సకాలంలో రాకపోయినా గాయపడ్డవారు వేచి ఉండకుండా చూడాలని ఆనాడే తాను సంకల్పించుకొన్నట్టు చెప్పారు.
అందుకోసమే రోడ్డు ప్రమాదాల గురించి తన దృష్టికి వచ్చినప్పుడు గాయపడ్డ వారిని వెంటనే తన ‘కార్ అంబులెన్స్’లో దగ్గరలోని దవాఖానకు చేర్చి చికిత్స అందేలా చూస్తానని తెలిపారు. ఇందుకోసం తన కారులో ప్రాథమిక చికిత్స సామగ్రి, దుప్పట్లు, అత్యవసర సూచికలు, అవసరమైతే సైరన్ వినిపించే సౌకర్యాన్ని అమర్చానని వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు తన సేవకు సహకరిస్తారని.. క్షతగాత్రుల తరలింపు సమయంలో రోడ్లపై రద్దీని అత్యవసరంగా క్లియర్ చేస్తారని సందీప్ తెలిపారు.