న్యూఢిల్లీ : భారత్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విలయం సృష్టిస్తున్నది. ఆదివారం ఒకే రోజు 17 మందికి వైరస్ పాజిటివ్గా తేలింది. ఇందులో తొమ్మిది రాజస్థాన్లోని జైపూర్లోని ఆదర్శనగర్లో వెలుగు చూశాయి. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చిన అనంతరం నిర్వహించిన పరీక్షల్లో వీరికి వైరస్ పాజిటివ్గా తేలింది.
ఒమిక్రాన్ కేసులు బయటపడ్డ నేపథ్యంలో నాగౌర్లోని రోహిసా ప్రాంతంలో రాజస్థాన్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. ఇంతకు ముందు మహారాష్ట్రలోని పుణెలో ఏడుగురికి పాజిటివ్ వచ్చింది. పబ్లిక్ హెల్త్ తెలిపిన వివరాల ప్రకారం.. గత నెల 24న నైజీరియా నుంచి తిరిగి వచ్చిన 44 సంవత్సరాల మహిళతో పాటు ఐదుగురు బంధువులకు ఒమిక్రాన్ సోకింది. పుణెలోని పింప్రి చించ్వాడ్లో ఈ కేసులు నమోదయ్యాయి. అలాగే నగరానికి చెందిన 47 సంవత్సరాల వ్యక్తి సైతం కొత్త వైరస్ బారినపడ్డట్లు తేలింది.
ఇవాళ ఒకే రోజు మహారాష్ట్రలో ఏడు కేసులు రికార్డవగా.. నిన్న కళ్యాణ్ డోంబివాళిలో ఒకరు వైరస్ బారినపడ్డ విషయం తెలిసిందే. అలాగే ఢిల్లీలోనూ ఒకే కేసు నమోదైంది. కొత్త కేసులతో దేశంలో మొత్తం ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 21కి పెరగ్గా.. రాజస్థాన్లో తొమ్మిది మంది, మహారాష్ట్రలో ఎనిమిది మంది, కర్నాటకలో ఒకరు, ఢిల్లీలో ఒకరు వైరస్ బారినపడ్డారు. ఒకే రోజు పెద్ద సంఖ్యలో కేసులు వెలుగు చూడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతున్నది.