Puri Laddu : తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వినియోగించారంటూ వివాదం తలెత్తిన ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. పూరీ జగన్నాథుడికి నైవేద్యంగా సమర్పించే పదార్థాల్లో వినియోగించే నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించింది. ఈ మేరకు పూరీ జిల్లా కలెక్టర్ సిద్దార్థ శంకర్ స్వైన్ బుధవారం ఒక ప్రకటన చేశారు. 12వ శాతాబ్దం నుంచి జగన్నాథుడికి వివిధ రూపాల్లో ప్రసాదాలు సమర్పిస్తున్నామని తెలిపారు.
అయితే ఏ నాడు విమర్శలు అయితే రాలేదని పేర్కొన్నారు. జగన్నాథుడి ప్రసాదం తయారీలో ఒడిశా మిల్క్ ఫెడరేషన్ సంస్థ తయారు చేసిన నెయ్యినే వినియోగిస్తున్నట్లు ఆయన తెలిపారు. కేవలం సందేహాన్ని నివృత్తి చేసుకునేందుకే ఈ నెయ్యి నాణ్యతను పరీక్షించాలని నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. గతంలో గుడి ఆవరణలో దీపాలు వెలిగించేందుకు కల్తీ నెయ్యి వినియోగించినట్లు గుర్తించామని జగన్నాథ స్వామి దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న జగన్నాథ స్వైన్ మహాపాత్ర ఈ సందర్బంగా గుర్తుచేశారు.
దాంతో ఆ నెయ్యి సరఫరాను దేవాలయ ఉన్నతాధికారులు నిలిపి వేశారని చెప్పారు. భక్తుల విశ్వాసమే తమకు ముఖ్యమని ఈ సందర్భంగా మహాపాత్ర గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలో వెంకన్న లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించినట్లు ఎన్డీడీబీ నివేదిక వెల్లడించింది. దాంతో చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది.