Prakash Raj | తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురం లోక్సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి శశి థరూర్ మళ్లీ గెలవబోతున్నారని కన్నడ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక వ్యాఖ్యలు చేశారు. శశి థరూర్ మరోసారి గెలిచి.. లోక్సభకు వెళ్తారని పేర్కొన్నారు. శశి థరూర్కు అండగా నిలబడడానికే తిరువనంతపురం వచ్చాను అని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఆయన తనకు స్నేహితుడు అని, గత దశాబ్ద కాలం నుంచి ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నికల్లో గెలిపించుకోవాలన్నారు ప్రకాశ్ రాజ్.
తిరువనంతపురం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్పై ప్రకాశ్ రాజ్ తీవ్ర విమర్శలు చేశారు. కర్నాటక నుంచి 18 ఏళ్ల పాటు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన రాజీవ్ చంద్రశేఖర్ ఆ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక్క డిమాండ్ కూడా నెరవేర్చలేదని ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు. తాను ఓ నటుడినని, రాజకీయ నేతను కాదని, కానీ సామాన్య ప్రజలు రాజకీయాలపై కూడా మాట్లాడవచ్చని ప్రకాష్ రాజ్ తెలిపారు. తాను మౌనంగా ఉండకపోవడం వల్లే ప్రజలు తనను ఇష్టపడతారన్నారు. తనకు కేరళ అంటే చాలా ఇష్టమని, మోడీ పాలనలో తాను అసౌకర్యంగా ఉన్నట్లు తెలిపారు.