కోల్కతా: ఇండియా కూటమి పార్టీల మధ్య సీట్ల పంపకం సరైన రీతిలో జరగలేదని, అందుకే మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందినట్లు తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ(Mamata Banerjee) తెలిపారు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఓడిందని, ఇది ప్రజల ఓటమి కాదు అని ఆమె అన్నారు. ఇవాళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆమె ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని.. మధ్యప్రదేశ్, చత్తీస్ఘడ్, రాజస్తాన్ రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ గెలిచేదని, కానీ ఇండియా కూటమి పార్టీలు కొన్ని ఓట్లను చీల్చాయని, ఇదే వాస్తవమని, సీట్ షేరింగ్ గురించి ఆ పార్టీతో మాట్లాడమని, ఓట్లు చీలడం వల్లే కాంగ్రెస్ ఓడిందని మమతా బెనర్జీ అన్నారు. ఐడియాలజీతో పాటు వ్యూహం కూడా చాలా అవసరమైందన్నారు. ఒకవేళ సరైన రీతిలో సీట్ షేరింగ్ జరిగితే, అప్పుడు 2024లో బీజేపీ అధికారంలోకి రాదు అని మమతా బెనర్జీ అన్నారు.