Congress | కర్ణాటకలో ఇటీవల వెలుగుచూసిన స్కాంగ్రెస్ కోట్ల కట్టల బాగోతం గురించి ఆ రాష్ట్రంలో దుమారం రేగుతున్నది. ఐటీ అధికారుల సోదాల్లో బయటపడింది రూ.90 కోట్లేనని, నిజానికి ఐదు రాష్ర్టాల ఎన్నికల కోసం హస్తం పార్టీ రూ.వెయ్యి కోట్లకు పైగా సొమ్మును సమీకరించినట్టు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో పంపిణీ చేయడానికే తొలివిడుతలో రూ.300 కోట్లను పక్కకుపెట్టిందని, అయితే ఊహించని విధంగా ఐటీ దాడుల్లో 90 కోట్లు పట్టుబడటంతో కాంగ్రెస్కు ఊహించని షాక్ తగిలిందని కన్నడ రాజకీయ వర్గాల్లో పెద్ద యెత్తున చర్చ జరుగుతున్నది. మిగతా రూ. 910 కోట్లను లక్షిత ప్రాంతాలకు ఎలా చేర్చాలన్న దానిపై హస్తం పార్టీ కొత్త స్కెచ్లకు ఇప్పుడు తెరతీస్తున్నదని తెలుస్తున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) బెంగళూరు(నమస్తే తెలంగాణ): కర్ణాటకలో ఇటీవల జరిగిన ఐటీ సోదాల్లో పట్టుబడ్డ రూ.90 కోట్ల అక్రమ నగదు కేవలం తీగేనని.. అసలు డొంక ఇంకా కదలాల్సి ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణతో పాటు ఐదు రాష్ర్టాల్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పంపిణీ చేయడానికి కాంగ్రెస్ సర్కారు రూ.వెయ్యి కోట్లను అక్రమంగా సమీకరించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వ కాంట్రాక్టర్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబీకాపతి ఇంట్లో రూ.42 కోట్లు, మాజీ ఎమ్మెల్సీ కాంతరాజ్కు సన్నిహితుడైన బిల్డర్ సంతోశ్ ఇంట్లో రూ.45 కోట్లు పట్టుబడిన విషయం తెలిసిందే. నిందితులు కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కావడం, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్కు అత్యంత సన్నిహితులవడంతో కాంగ్రెస్ కోట్ల కట్టల స్కామ్కు పాల్పడిందన్న అనుమానాలు పెరిగాయి. ఇప్పటివరకూ పట్టుబడిన డబ్బు ఎన్నికలు జరిగే రాష్ర్టాలకు తరలించడానికి సమీకరించినట్టు సమాచారం ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ, మాజీ ముఖ్యమంత్రి యెడియూరప్ప ఆరోపించడం, అక్రమ సొత్తు సూత్రధారి డీకేనేనని మాజీ సీఎం కుమారస్వామి మండిపడటంతో ఈ అనుమానాలు బలపడ్డాయి. ఐదు రాష్ర్టాల ఎన్నికల్లో పంపిణీ చేయడానికి కాంగ్రెస్ పార్టీ.. కర్ణాటక సర్కారుకు రూ.1,000 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించిందని ప్రస్తుతం కన్నడనాట చర్చ జరుగుతున్నది. అది కూడా తొలి విడుతేనని తెలుస్తున్నది. డబ్బు వసూళ్లు ఎలా చేయాలి? ఎవరి ద్వారా బట్వాడా చేయాలి? ఎలా రాష్ట్రం దాటించాలి? అనే విషయాలపై హస్తంపార్టీ ఓ బ్లూ ప్రింట్నే సిద్ధం చేసిందన్న ఆరోపణలు పెద్దయెత్తున వినిపిస్తున్నాయి.
గట్టెక్కడం కష్టమని తేలడంతో..
తెలంగాణతో పాటు మిగతా రాష్ర్టాల్లో గట్టెక్కడం కష్టమనే నిర్ణయానికి వచ్చిన తర్వాతే, కాంగ్రెస్ అక్రమాలకు బ్లూప్రింట్ సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. పదేండ్లలో తెలంగాణను దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో సీఎం కేసీఆర్ సఫలీకృతమయ్యారు. రాష్ట్రప్రజానీకమంతా ఆయన వెంటే ఉన్నట్టు సర్వేలూ చెబుతున్నాయి. దీంతో అక్రమ మార్గంలో ఓటర్లను ఆకర్షించడానికి హస్తం కుట్రకు తెరతీసినట్టు వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్లోనూ ప్రజా వ్యతిరేకత, మిజోరంలో పార్టీ ప్రభ మసకబారడంతో కాంగ్రెస్ ఈ స్కామ్కు కుట్రపన్నినట్టు అనుమానిస్తున్నారు.
అధికారులకు టార్గెట్లు
‘40 శాతం కమీషన్ రాజ్’ బీజేపీ సర్కారును గద్దె దించి కర్ణాటకలో పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్.. అంతకు మించి అక్రమాలకు పాల్పడుతున్నది. బెంగళూరు నగరపాలికలో పెండింగ్లో ఉన్న సుమారు రెండు వేల కోట్ల రూపాయాల బిల్లులను క్లియర్ చేయడానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ 15 శాతం కమీషన్ డిమాండ్ చేస్తున్నారని కర్ణాటక కాంట్రాక్టర్ల సంఘం ఏకంగా రాష్ట్ర గవర్నర్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయడం, వ్యవసాయ శాఖ మంత్రి తమకు నెలనెలా కప్పం చెల్లించాలని వేధిస్తున్నారని అధికారులు ఆరోపించడమే దీనికి ఉదాహరణలు. ఇక, లక్షిత కాంట్రాక్టర్లు, బిల్డర్లు, వ్యాపారుల నుంచి లక్షల రూపాయలను వసూలు చేయాలని అధికారులకు ప్రభుత్వంలోని కొందరు పెద్దలు టార్గెట్లుగా నిర్ణయించినట్టు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే కాంగ్రెస్ వసూళ్ల పర్వం షురూ అయ్యిందని, టార్గెట్ చేరుకోని అధికారులపై ట్రాన్స్ఫర్లు, సస్పెన్షన్లు, నోటీసుల పేరిట వేధించేవారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఐటీకి ఎలా తెలిసిందంటే?
ఈనెల 9న ఐదు రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వెలువడిన నేపథ్యంలో వీలైనంత త్వరగా డబ్బును పంపిణీ చేయాలనుకొన్న స్కాంగ్రెస్కు ఐటీ అధికారులు ఊహించని షాక్లు ఇస్తున్నారు. మొత్తంగా కర్ణాటకలో రూ.90 కోట్ల వరకూ సీజ్ చేశారు. అయితే, మిగతా రూ. 910 కోట్ల డబ్బు ఇంకా పట్టుబడలేదని, దాన్ని లక్షిత ప్రాంతాలకు ఎలా తరలించాలన్న దానిపై కాంగ్రెస్ పెద్దలు తలపట్టుకొంటున్నట్టు పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, బీజేపీ హయాంలో టెండర్లు దక్కించుకొన్న కొందరి కాంట్రాక్టులను కొత్తగా వచ్చిన కాంగ్రెస్ సర్కారు రద్దు చేసింది. దీంతో కడుపుమండిన వాళ్లే కాంగ్రెస్ అక్రమాలపై ఐటీకి ఉప్పందించినట్టు పలువురు చెబుతున్నారు.
ఐదు రాష్ర్టాలకు పంపిణీ ఇలా..
అధికారుల ద్వారా సేకరించిన సొమ్ములో తొలి విడతలో రూ.1,000 కోట్లను ఐదు రాష్ర్టాలకు పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ నిర్ణయించిందని అంటున్నారు. తెలంగాణకు రూ.300 కోట్లు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్,మధ్యప్రదేశ్లకు రూ.200 కోట్ల చొప్పున పంపిణీ చేయాలనుకొన్నట్టు సమాచారం. మిగతా రూ. 100 కోట్లను మిజోరానికి కేటాయించినట్టు చెబుతున్నారు. నమ్మకస్తుల వద్ద నాలుగు రోజులు ఉంచి, ఆ తర్వాత లక్షిత రాష్ర్టానికి బట్వాడా చేయాలనుకొన్నట్టు సమాచారం.
డ్యామేజీ నివారణకు..
ఐదు రాష్ర్టాల ఎన్నికల వేళ కర్ణాటకలో పెద్దయెత్తున అక్రమ నగదు పట్టుబడటం, ఈ విషయంలో కాంగ్రెస్ అడ్డంగా దొరికిపోవడంతో పార్టీకి చాలావరకూ డ్యామేజీ జరిగిపోయింది. ఈ క్రమంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సోమవారం అత్యవసరంగా బెంగళూరుకు వచ్చి.. డీకే శివకుమార్తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నష్టనివారణ చర్యల్లో భాగంగానే ఈ భేటీ జరిగిందని, స్కామ్లో డీకే పేరు బయటకు రావడంపై కాంగ్రెస్ పెద్దలు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.