హైదరాబాద్: జీఎస్ఎల్వీ ఎఫ్-10 రాకెట్ ప్రయోగం విఫలమైన విషయం తెలిసిందే. ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ను మోసుకు వెళ్తున్న సమయంలో.. క్రయోజనిక్ దశలో రాకెట్ పేలింది. దీనిపై ఇస్రో మాజీ చైర్మన్ మాధవన్ నాయర్ ( Madhavan Nair ) షాక్ వ్యక్తం చేశారు. అయినా మళ్లీ ఇస్రో తన సత్తాను చాటగలదు అని ఆయన అన్నారు. శ్రీహరికోట నుంచి ఇవాళ ఉదయం 5.43 నిమిషాలకు ఎగిరిన ఎఫ్-10 రాకెట్.. క్రయోజనిక్ ఇంజిన్ ఇగ్నైట్ కాకపోవడంతో.. ప్రయోగం విఫలమైంది. 2003 నుంచి ఆరేళ్ల పాటు ఇస్రో చైర్మన్గా ఉన్న నాయర్.. తన పదవీకాలం సమయంలో సుమారు 25 మిషన్లను విజయవంతంగా చేపట్టారు. ప్రయోగాలు విఫలం కావడం సహజమే అని, ఇలాంటి ఘటనల వల్ల గుండె ధైర్యాన్ని కోల్పోవద్దు అన్నారు. ఇదో సంక్లిష్టమైన మిషన్ అని, రాకెట్ ప్రొపల్షన్ టెక్నాలజీల్లో.. క్రయోజెనిక్ దశ అత్యంత క్లిష్టమైందని మాధవన్ నాయర్ తెలిపారు.
క్రయోజనిక్ టెక్నాలజీ విషయంలో ఇస్రో ఎంతో పరిణితి సాధించిందని, యూరోప్ లేదా రష్యాతో పోలిస్తే ఇస్రో రికార్డు చాలా పర్వాలేదన్నారు. రష్యా, యూరోప్ దేశాల్లో క్రయోజనిక్ ఫెయిల్యూర్ 20 శాతంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. క్రయోజనిక్ ఇంజిన్తో రాకెట్ను లాంచ్ చేయడం ఇది ఎనిమిదో సారి అని, తొలి ప్రయోగం విఫలమైందని, ఆ తర్వాత ఏడు సక్సెస్ అయినట్లు ఆయన చెప్పారు. క్లిష్టమైన వ్యవస్థ ఉన్నందున కొన్ని సమస్యలు ఉంటాయని, దీని పట్ల నిరాశ చెందవద్దు అని, అయితే ఫెయిల్యూర్కు మూల కారణం ఎంటో తెలుసుకోవాలన్నారు. ఎందుకంటే ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృత్తం కాకుండా చూసుకోవాలని నాయర్ అభిప్రాయపడ్డారు. నిజానికి ఇది అందర్నీ షాక్కు గురి చేసిందని, ఈ షాక్ నుంచి త్వరగా తేరుకుని, మళ్లీ గాడిలో పడుతామని ఆయన అన్నారు.