KTR | రాజన్న సిరిసిల్ల : కరీంనగర్లో మనకు కాంగ్రెస్తో పోటీ లేదు.. బీజేపీతోనే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. చిన్నచిన్న మనస్పర్థలు పక్కనపెట్టి పని చేస్తే వినోద్ కుమార్ భారీ మెజార్టీతో గెలుస్తారు.. మళ్లీ కేసీఆర్ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తారని కేటీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని తంగళ్లపల్లిలో జరిగిన కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మోడీ 2014 లో ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కిండు. అదే ఏడాది బీఆర్ఎస్ కూడా అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్లలో ఏం పనులు చేసినవ్ అని అడిగితే సాయంత్రం దాకా లెక్క చెబుతా. రైతులు, నేతన్నలు, వృద్ధులకు చేసిన మంచి పనులు…అభివృద్ధి పనులు ఎన్నో చేసినం అని చెబుతా. మరి బీజేపోళ్లకు ఎందుకు ఓటు వేయాలో ఒక్క కారణం చెప్పు బండి సంజయ్. ఒక్క పైసా పని చేయకుండా మేము గుడి కట్టినం అంటారు. గుడి కట్టుడు ఒక్కటే ఓటు వేసేందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదాద్రి. దేవున్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నామా? కేసీఆర్ కాళేశ్వరం లాంటి ఆధునిక దేవాలయం కట్టిండు. రిజర్వాయర్లు, చెరువులు, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసిండు. వాటికి కూడా మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, రాజరాజేశ్వర సాగర్, కొండ పోచమ్మ సాగర్ అని దేవుళ్ల పేరు పెట్టిండు. మిడ్ మానేరులో సముద్రాన్ని తెచ్చినట్టు నీళ్లతో నింపిండు. మరి దేవుళ్లకు ఇంత సేవ చేసిన కేసీఆర్కు ఓటు వేయాల్నా? వద్దా? అనేది ఆలోచించుకోవాలని కేటీఆర్ సూచించారు.
రైతుల ఆదాయం డబుల్, ప్రతి ఇంటికి నల్లా, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ, బుల్లెట్ ట్రైన్, రూ. 15 లక్షలు అన్నాడు మోడీ. ఒక్కటన్నా అయ్యిందా? అదే కేసీఆర్ సిరిసిల్ల, కరీంనగర్ పరిధిలో ఎన్నో పనులు చేసిండు. మరి ఏమీ చేయని మోడీకి ఓటు వేద్దామా? చిన్న చిన్న కారణాలతో కేసీఆర్కు ఓటు వేయకుండా ఉందామా? మోడీ ఈ దేశానికి చేసిన అతి పెద్ద మోసం…మొత్తం ధరలు పెంచటం. మోడీ ప్రధాని అయినప్పటికి ఇప్పటికీ క్రూడ్ ఆయిల్ ధర 16 డాలర్లు తగ్గింది. మరి క్రూడ్ ఆయిల్ ధర తగ్గిన తర్వాత కూడా పెట్రోల్, డిజీల్ ధరలు ఎందుకు పెరిగినయ్. ప్రజల ముక్కు పిండి రాష్ట్రాలకు వాటా దక్కకుండా సెస్ వేసి రూ. 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. 34 శాతం పన్ను అదనంగా వేసి మన దగ్గర నుంచి 30 లక్షల కోట్లు వసూలు చేసిండు. ఏం చేసినవయ్యా ఆ పైసలు అంటే జాతీయ రహదారులు కట్టినా అంటాడు. మరి టోల్ ఎందుకు వసూల్ చేసినవంటే చెప్పడు. రూ. 30 లక్షల కోట్ల నుంచి అదానీ, అంబానీ లాంటి పారిశ్రామిక వేత్తలకు రూ. పద్నాలుగున్నర లక్షల కోట్లు రుణమాఫీ చేసిండు. నేను చెప్పింది తప్పని బండి సంజయ్ నిరూపిస్తే నా రాజీనామా ఆయన చేతిలో పెడతా అని కేటీఆర్ సవాల్ విసిరారు.