తిరుపతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ఎల్వీఎం-3 (LVM-3) రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. వన్వెబ్కు (Oneweb) చెందిన 5.8 టన్నులున్న 36 ఉపగ్రహాలను నింగిలోకి మోసుకెళ్లింది. 20 నిమిషాలు ప్రయాణించిన అనంతరం 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న నిర్ధేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టనుంది. వెంటనే ఆ ఉపగ్రహాలను యూకేలోని (UK) గ్రౌండ్ స్టేషన్ నుంచి తమ ఆధీనంలోకి తీసుకుని నియంత్రించనున్నారు.
నిరంతరాయంగా 24.30 గంటలపాటు సాగిన కౌంట్డౌన్ అనంతరం ఆదివారం ఉదయం 9 గంటలకు షార్లోని రెండో లాంచ్ప్యాడ్ నుంచి రాకెట్ను ఇస్రో (ISRO) ప్రయోగించింది. ఈ రాకెట్ 43.5 మీటర్ల పొడవు, 643 టన్నుల బరువు ఉన్నది. పూర్తిగా వాణిజ్య అవసరాలకోసం ఈ రాకెట్ను ఇస్రో ప్రయోగించింది. దీనికోసం ఇస్రో వాణిజ్య విభాగం న్యూ స్పేస్ ఇండియా (New space India) లిమిటెడ్ యూకేకు చెందిన వన్వెబ్తో ఒప్పందం కుదుర్చుకున్నది. ఇందులో భాగంగా వన్వెబ్కు సంబంధించిన 72 ఉపగ్రహాలను నింగిలోకి పంపిచాల్సి ఉంటుంది. వాటిలో 36 ఉపగ్రహాలను గతేడాది అక్టోబర్లో ఇస్రో విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. తాజాగా రెండో విడుతలో మరో 36 ఉపగ్రహాలను నింగిలోకి పంపించింది.