ISRO-INSAT-3DS | భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) చేపట్టిన ఇన్శాట్ 3డీఎస్ ప్రయోగం విజయవంతమైంది. జీఎస్ఎల్వీ- ఎఫ్ 14 వాహక నౌక ద్వారా ఇస్రో ఇన్శాట్ డీఎస్ శాటిలైట్ను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. శ్రీహరికోటలోని షార్ రెండో నెంబర్ లాంచ్ప్యాడ్ నుంచి సాయంత్రం 5.35 గంటలకు జీఎస్ఎల్వీ-ఎఫ్14 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగం కోసం శుక్రవారం మధ్యాహ్నం 2.05 గంటలకు ప్రారంభమైంది. కౌంట్డౌన్ 27.30 గంటల పాటు నిరంతరాయంగా కొనసాగింది.
ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహం ద్వారా వాతావరణ పరిశీలనలను మెరుగుపరిచేందుకు.. భూమి, సముద్ర ఉపరితల వాతావరణం అధ్యయనం చేయనుండగా.. పరిశోధనల కోసం ఇస్రోకు మెరుగైన సమాచారం అందించనున్నది. శాటిలైట్ పదేళ్ల పాటు ఇస్రోకి సేవలు అందించనున్నది. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ సోమ్నాథ్ మాట్లాడుతూ ప్రయోగం విజయవంతమైనట్లు ప్రకటించారు. శాస్త్రవేత్తల బృందానికి అభినందనలు తెలిపారు.
అనుకున్న విధంగానే ఇన్శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని జీఎల్ఎల్వీ-ఎఫ్14 విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టిందని వెల్లడించారు. ఇన్శాట్ ప్రయోగం విజయవంతమైందని చెప్పేందుకు సంతోషిస్తున్నానన్నారు. నిర్దేశించి విధంగానే రాకెట్ కక్ష్యలో ప్రవేశించిందని.. ప్రక్రియ అంతా సాఫీగా సాగిందన్న ఆయన.. మిషన్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలు, సిబ్బంది అందరికీ అభినందనలు తెలుపుతున్నానన్నారు.
ఇన్శాట్ 3డీఎస్తో ఖచ్చితమైన సమాచారం అందుతుందన్నారు. భూ, సముద్ర వాతావరణంపై ఖచితత్వంతో సమాచారం సాధ్యమవుతుందన్నారు. ప్రయోగం విజయవంతంగా నిర్వహించిన ఇస్రో బృందానికి కేంద్రమంత్రి జితేంద్రసింగ్ అభినందనలు తెలిపారు. అంతరిక్షరంగంలో అనేక విషయాలు సాధించామన్నారు. మోదీ ప్రోత్సాహంతో ఇస్రో వరుస విజయాలు సాధిస్తుందని పేర్కొన్నారు.