న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా ముస్లిమేతరులపై దాడులకు ఏడుగురు అనుమానిత ఐసిస్ ఉగ్రవాదులు కుట్ర పన్నినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఛార్జిషీట్ ఆరోపించింది. వీరంతా సాంకేతికంగా, విద్యాపరంగా బాగా చదువుకున్నవారేనని తెలిపింది. వీరు తమ హ్యాండ్లర్ల ఆదేశాల మేరకు ఐసిస్ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను నిర్వహించేందుకు నిధులను సేకరించారని పేర్కొంది. దేశంలో ఐసిస్ ఉగ్రవాద భావజాలాన్ని వ్యాపింపజేయడానికి కృషి చేస్తున్న వ్యక్తుల సంక్లిష్టమైన నెట్వర్క్ను గుర్తించినట్లు తెలిపింది. ‘రివెంజ్ ఆన్ కాఫిర్స్(తిరస్కరించే వారిపై ప్రతీకారం)’ పేరుతో ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది. దాడులు చేయడానికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను గుర్తించేందుకు మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, తెలంగాణ, కేరళలలో వీరు కొన్ని ప్రాంతాలను పరిశీలించారని తెలిపింది.